జోస్యం చెప్పేసిన రేవంత్

తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జోస్యం చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 25 సీట్లకు మించి వచ్చే అవకాశంలేదన్నారు. కేసీయార్ ఎంత ప్రయత్నించినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ కు వచ్చే సీట్లు మ్యాగ్జిమమ్ 25 అని కచ్చితంగా చెప్పారు. అంత కచ్చితంగా ఎలా చెబుతారంటే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్లుగా చెప్పారు. మరి రేవంత్ కాన్ఫిడెంట్ ఏమిటో తెలీదు.

బీఆర్ఎస్ కు వచ్చేసీట్ల సంఖ్యను చెప్పారు కానీ కాంగ్రెస్ కు ఎన్నిసీట్లు వస్తుందనే విషయాన్ని రేవంత్ చెప్పలేదు. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతు 70 సీట్లలో మినిమం గెలవాలని పదేపదే చెబుతున్నారు. 119 నియోజకవర్గాల్లో 70 సీట్లలో మినిమం అంటే 65 శాతం అన్నమాటే.  మరి కాంగ్రెస్ కు అంత సీనుందా అన్నదే అర్ధంకావటంలేదు. ఎందుకంటే పార్టీ సీనియర్లలో గ్రూపు తగాదాలు చాలా ఎక్కువ. వ్యక్తిగత ప్రాబల్యం కోసం పార్టీ నాశనమైపోయినా పట్టించుకోరు.

ఇలాంటి కారణాలతోనే, వ్యక్తిగత ప్రిస్టేజ్ కి వెళ్ళటం వల్లే గడచిన రెండు ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. నేతల్లోనే ఒకళ్ళని ఓడించటానికి మరొకళ్ళు ప్రయత్నించటం, గెలుపుకు సహకరించకుండా దూరంగా ఉండటం, ప్రత్యర్ధి పార్టీ గెలుపుకు సహకరించటం లాంటి కారణాలతోనే కాంగ్రెస్ చాలా సీట్లను కోల్పోయింది. పోయిన ఎన్నికల్లో సీనియర్లంతా ఏకతాటిపైకి వచ్చి గట్టిగా ప్రయత్నించుంటే మంచి ఫలితాలే వచ్చుండేవి.

రెండు ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో కూడా ఓడిపోతే ఇక అంతే సంగతులు. ఒకపార్టీ మూడు వరుస ఎన్నికల్లో ఓడిపోతే నేతలు, క్యాడర్ పార్టీని అంటిపెట్టుకుని ఉండటం కష్టమే. మెల్లిగా కాంగ్రెస్ మాయమైపోవటం ఖాయం. ఆ ప్రమాదాన్ని గ్రహించిన కారణంగానే  డైరెక్టుగా అధిష్టానమే రంగంలోకి దిగి సినియర్ నేతలందరినీ సమన్వయం చేసి ఏకతాటిపైన నడిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఏ సీనియర్ ఏమిచేస్తారో చివరి నిముషం వరకు రేవంత్ కూడా ఊహించలేరు. అందుకనే పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యను కాకుండా బీఆర్ఎస్ గెలవబోయే సంఖ్యను చెప్పారు.