ఇండియా విచ్ఛిన్నం.. నిన్న నితీష్‌.. నేడు ప‌వార్‌!

ఇండియా.. విప‌క్షాల‌న్నీ ఏక‌మై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దెదింపేందుకు ఏర్పాటు చేసుకున్న పెద్ద కూట‌మి. మొత్తంగా 26 ప్ర‌తిప‌క్ష పార్టీలు చేతులు క‌లిపి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేంద్రంలో పోరాడాల‌ని అవ‌స‌ర‌మైతే.. ఉమ్మ‌డి ప్ర‌ణాళిక‌ను ఏర్పాటు చేసుకుని.. ఒక్కొక్క లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి విప‌క్షాల అభ్య‌ర్థుల‌ను ఒక్కొక్క‌రినే పోటీకి పెడ‌దామ‌ని కూడా నిర్ణ‌యించుకున్నారు. ఇక‌, ఇప్ప‌టికే రెండు చోట్ల స‌భ‌లు కూడా నిర్వ‌హించారు. ప్లాన్ రెడీ అవుతోంది.

ఇలాంటి కీల‌క స‌మ‌యంలో అనూహ్యంగా ఉరుములు లేని పిడుగుల మాదిరిగా ఇండియా కూట‌మిలో అనూహ్య‌మైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండు రోజుల కింద‌ట‌.. బిహార్ ముఖ్య‌మంత్రిని ఉద్దేశించి కేంద్ర మంత్రి అథావ‌లే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నితీష్ ఎన్డీయే ప‌క్ష‌మేన‌ని.. ఇండియాతో చేతులు క‌ల‌ప‌డం ఉత్త‌మాటేన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను నితీష్ ఖండించ‌లేదు. అంటే.. ఆయ‌న మ‌న‌సు ఎన్డీయే పైనే ఉంద‌నే సంకేతాలు వ‌చ్చేశాయి.

మ‌రోవైపు.. ఇండియా పేరు కూడా త‌న‌కు న‌చ్చ‌లేద‌ని.. నితీష్ గ‌తంలోనే వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా చ‌ర్చించాల్సి ఉంద‌ని అప్ప‌ట్లో అనుకున్నా.. తాజాగా మారుతున్న ప‌రిణామాల‌తో నితీష్‌.. ఇండియాకు దూర‌మ‌వుతున్నార‌ని తెలుస్తోంది. ఇక‌, తాజాగా మ‌రో సంచ‌ల‌న మార్పు చోటు చేసుకుంది. మ‌హారాష్ట్ర‌కు చెందిన ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ కూడా యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ పాల్గొనే కార్య‌క్ర‌మంలో ఆయ‌న కూడా.. పీఎం ప‌క్క‌న కూర్చోనున్నారు.

నిజానికి ఇండియా కూట‌మిలో నిన్న‌టి వ‌ర‌కు కూడా కీల‌కంగా ఉన్న మాజీ సీఎం శ‌ర‌ద్ ప‌వార్‌.. అనూహ్యం గా మోడీ ప‌క్క‌న కూర్చునేందుకు అంగీక‌రించ‌డం.. మోడీని స‌న్మానించే కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానుండడం వంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఇండియా నుంచి ఆయ‌న కూడా క‌డుదూరంలో ఉన్నార‌నే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఇటీవ‌ల ఎన్సీపీలో ముస‌లం పుట్టి.. శ‌ర‌ద్ త‌మ్ముడి కుమారుడు.. అజిత్ ప‌వార్ బీజేపీతో చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా శ‌ర‌ద్ మోడీ కార్య‌క్ర‌మంలో పాల్గొంటున్నారు. సో.. ఇలాంటిప‌రిణామాలు ఇంకెన్ని జ‌రుగుతాయో.. ఇండియా ఉంటుందో .. విచ్ఛిన్నం అవుతుందో.. అనే చ‌ర్చ జాతీయ రాజ‌కీయాల్లో ఊపందుకుంది.