వైసీపీకి జేసీ బ్ర‌ద‌ర్స్ దూర‌మైంది అందుకేనా..?

రాజ‌కీయాల్లో కొన్ని కొన్ని విష‌యాలు గ‌మ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడో జ‌రిగిన సంగ‌తుల తాలూకు నిజానిజాలు.. విష‌యవాస‌న‌లు.. ఎప్పుడో కానీ.. వెలుగు చూడ‌వు. ఇప్పుడు అలాంటి ఒక కీల‌క విష‌యం వెలుగు చూసింది. రాజ‌కీయాల్లో ఆస‌క్తి ఉన్న ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిన ఫైర్ బ్రాండ్ నాయ‌కులు జేసీ బ్ర‌దర్స్‌. ఉమ్మ డి అనంత‌పురం జిల్లాకు చెందిన వీరు.. దాదాపు 50 ఏళ్లుగా రాజ‌కీయ‌ల్లో ఉన్నారు.

ఆది నుంచి కూడా కాంగ్రెస్‌లోనే ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్‌.. మంచి ఫామ్‌లోనూ కొన‌సాగారు. ముఖ్యంగా జేసీ దివాక‌ర్ రెడ్డి మంత్రిగా.. తాడిప‌త్రి ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, జేసీ ప్ర‌భాక‌ర్ మాత్రం వ్యాపారానికి ప‌రిమితం అయ్యారు. ఇక‌, సుదీర్ఘ‌కాలం కాంగ్రెస్‌లో ఉన్నా.. 2014స‌మ‌యంలో జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌న, అనంత‌ర ప‌రిణామాలతో వారు.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే.. ఈ స‌మ‌యంలో వారు వైసీపీలోకి రావాల‌ని అనుకున్నారట‌!

ఈ విష‌యం మీడియాలోనూ అప్ప‌ట్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌కు దివాక‌ర్‌రెడ్డి త‌న‌యుడు.. ప‌వ‌న్ కుమార్ రెడ్డి మిత్రుడు కావ‌డం.. ఆది నుంచి కూడా.. ఈ కుటుంబంతో వైఎస్ కుటుంబానికి కూడా ప‌రిచ‌యాలు ఉండ‌డంతో వైసీపీలోకి రావాల‌నే ప్రయ‌త్నం చేశార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా జేసీ కుటుంబాలు.. టీడీపీవైపు మ‌ళ్లాయి. 2014లో ఆ పార్టీ ఏకంగా రెండు టికెట్లు ఇచ్చింది. వారు గెలిచారు కూడా.

ఇక‌, అప్ప‌ట్లో వైసీపీలోకి ఎందుకు వెళ్ల‌లేక పోయార‌నే సందేహం మాత్రం అలానే ఉండిపోయింది. దీనిపై తాజాగా జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి స్పందిస్తూ.. కాంగ్రెస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత‌.. వైసీపీకి మ‌ద్ద‌తు ప‌లకాల‌ని.. చ‌ర్చించుకున్నామ‌ని, ఈ క్ర‌మంలోనే విజ‌య‌సాయిరెడ్డి త‌మ ఇంటికి వ‌చ్చార‌ని.. పార్టీలో చేరాల‌ని కూడా కోరార‌ని తెలిపారు.

అయితే.. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. పార్టీలో చేరినందుకు పార్టీ ఫండ్‌గా.. రూ. కోట్లు క‌ట్టాల‌ని కోరిన‌ట్టు చెప్పారు. ఇక‌, టికెట్లు ఇచ్చేవ‌ర‌కు మాత్రం పార్టీ బాధ్య‌త అని.. గెలవ‌డం.. డ‌బ్బులు పంచ‌డం వంటివి మీరే చూసుకోవాల‌ని చెప్పిన‌ట్టు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల్లో నిధుల వ‌ర‌కు తాము ఓకే అయినా.. పార్టీకి ఫండ్ ఇచ్చేది లేద‌ని తేల్చి చెప్పిన‌ట్టు జేసీ తెలిపారు. ఇదే.. వైసీపీకి-జేసీ బ్ర‌ద‌ర్స్‌కు మ‌ధ్య వివాదంగా మారిందని ప్ర‌భాక‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చారు.