అది కుంత‌ల రాజ్యం.. ఇది గుంత‌ల రాజ్యం: నారా లోకేష్

ఏపీ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న టీడీపీ యువ‌నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ తాజాగా మ‌రోసారి పంచ్‌ల‌తో విరుచుకుప‌డ్డారు. “బాహుబ‌లి సినిమాలో కుంత‌ల రాజ్యం చూశాం.. ఇప్పుడు ఏపీలో గుంత‌ల రాజ్యం చూస్తున్నాం ” అని పంచ్‌లు పేల్చారు. ప్ర‌స్తుతం యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో ఉన్న నారా లోకేష్ ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న విష‌యం తెలిసింది. ఈ క్ర‌మంలో కీల‌క వైసీపీ నాయ‌కుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రావు నియోక‌వ‌ర్గం ఒంగోలులో స‌భ నిర్వ‌హించారు.

ఈ స‌భ‌లో నారా లోకేష్ త‌న‌దైన శైలిలో పంచ్‌లు పేల్చారు. బాహుబ‌లి సినిమాలో కుంతల రాజ్యం చూశామ‌ని.. జ‌గ‌న‌న్న పాల‌న‌లో గుంతల రాజ్యం చూస్తున్నామ‌ని.. అన్నారు. దీంతో స‌భ‌లో ఒక్క‌సారిగా న‌వ్వులు విర‌బూశాయి. “జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారు” అని నారా లోకేష్ విమర్శించారు. “జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌. జగన్‌ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్‌, బల్లకింద రెడ్‌ బటన్‌” అని వ్యాఖ్యానించారు.

దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగనేన‌ని నారా లోకేష్ అన్నారు. ఎన్నిక‌ల‌కు ముందు మహిళలకు జగన్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదని విమ‌ర్శించారు. మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తాను తీసుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ హామీ ఇచ్చారు. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యింద‌ని, పెరిగిన సొమ్ము ఎవ‌రి ఖాతాలోకి వెళ్తోందో చెప్పాల‌ని ఆయ‌న నిల‌దీశారు.

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని నారా లోకేష్ అన్నారు. కులాల‌ను మ‌భ్య పెట్టేందుకు నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, క‌నీసం కూర్చునేందుకు కూడా కుర్చీలేకుండా అవ‌మానించార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్‌కు చిన్నచూప‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పేదలకు సీఎం జగన్‌ చేసిందేమీ లేదన్నారు. పేదలకిచ్చిన 3 లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారని విమ‌ర్శించారు. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశామ‌న్నారు. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్‌ వంద జన్మలు ఎత్తాల‌ని దుయ్య‌బ‌ట్టారు.