అందరికీ బీసీ ఓట్లే కావాలా ?

తెలంగాణాలో రాజకీయ పార్టీలన్నీ బీసీ సామాజికవర్గాలచుట్టూనే తిరుగుతన్నాయి. ముందుగా బీసీ డిక్లరేషన్ అని కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. తర్వాత బీజేపీ కూడా బీసీ డిక్లరేషన్ అన్నది. తాజాగా బీఆర్ఎస్ పార్టీలోని బీసీ ప్రజా ప్రతినిధులందరు ఎంఎల్ఏ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. తొందరలోనే బీసీ గర్జన పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించాలని ప్రయత్నాలు చేస్తోంది. తొందరలోనే పార్టీలోని బీసీ ప్రజాప్రతినిధులతో సమావేశమవ్వాలని కేసీయార్ అనుకుంటున్నారు. కొందరు మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్లను కూడా ఆహ్వానిస్తున్నారు.

ఆమధ్య వరంగల్లో జరిగిన బీసీ గర్జనలో రాహుల్ గాంధీ మాట్లాడుతు బీసీల కోసం ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రెడీ చేస్తామన్నారు. ఈమధ్యనే కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు తరచూ సమావేశమవుతున్నారు. హనుమకొండలో మొదటి సమావేశం జరుపుకున్న బీసీ నేతలు రెండో సమావేశాన్ని హైదరాబాద్ లోనే నిర్వహించుకున్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ సామాజికవర్గాల జనాభా ప్రాతిపదకన టికెట్లు కేటాయించాలని తీర్మానించారు. నేతల అంచనాల ప్రకారం సుమారు 75 నియోజకవర్గాల్లో బీసీల ఓట్లే నిర్ణయాత్మకంగా ఉంది.

అందుకనే కనీసం 45 నియోజకవర్గాల్లో టికెట్లివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమ తీర్మానాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా, రాహుల్, ప్రియాంకగాంధీకి కూడా పంపించాలని తీర్మానించారు. ఇక బీజేపీ విషయానికి వస్తే తొందరలోనే బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకోస నిపుణులతో కసరత్తు జరుగుతోంది. డిక్లరేషన్ డ్రాఫ్ట్ రెడీ అయిన తర్వాత బహుశా అమిత్ షానో లేకపోతే జేపీ నడ్డానో పిలిపించి బహిరంగసభ నిర్వహించి ప్రకటిస్తారేమో చూడాలి.

ఇక బీఆర్ఎస్ నేతలంతా ఎంఎల్ఏ క్వార్టర్స్ లో సమావేశమయ్యారు. మూడోసారి బీఆర్ఎస్ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలంటే బీసీ సామాజికవర్గానికి ఎక్కువ టికెట్లు కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, శ్రీనివాసగౌడ్ తో పాటు ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో పాటు సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. మొత్తంమీద రాబోయే ఎన్నికలు అచ్చంగా బీసీ ఓట్ల చుట్టూనే తిరిగేట్లుంది చూస్తుంటే.