మ‌చిలీప‌ట్నం పాలిటిక్స్ మారుతున్నాయ్‌.. పేర్నికి క‌ష్టాలేనా?

ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం మ‌చిలీప‌ట్నం. గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి వైసీపీ త‌ర‌ఫున పేర్ని నాని గెలుపు గుర్రం ఎక్కారు. త‌ర్వాత ఆయ‌న సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌నిచేశారు. అయితే.. గ‌త ఏడాది రెండో సారి మంత్రివ‌ర్గాన్ని విస్త‌రించిన‌ప్పుడు.. పేర్నిని త‌ప్పించారు. ఇక‌, ఇప్పుడు పేర్ని కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు పేర్ని కృష్ణ‌మూర్తి(కిట్టు)కి టికెట్ ఇవ్వాల‌ని కోరుతున్నారు. ఇదిలావుంటే.. మ‌రోవైపు.. ప్ర‌తిప‌క్షాలు పుంజుకుంటున్నాయి.

టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర 2014లో ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పేర్నిపై ఓడిపోయినా పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం వినిపిస్తున్నారు. మ‌ధ్య‌లో ఆయ‌న‌ను కూడా ఓ కేసులో పోలీసులు అరెస్టుచేశారు. అయినా.. ఎడ‌తెగ‌కుండా టీడీపీ వాయిస్ వినిపిస్తున్నారు. దీంతో టీడీపీ ఇక్క‌డ బ‌లం కోల్పోలేద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రో వైపు స్థానికంగా బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న కాపులు .. గ‌త ఎన్నిక‌ల్లో పేర్ని నానికి మ‌ద్దుతుగా నిలిచారు. అయితే.. ఈ సారి మాత్రం వారి ఊపు.. చూపు.. కూడా మారుతున్న సంకేతాలు వ‌స్తున్నాయి.

తాజాగా.. జనసేన తీర్థం పుచ్చుకునేందుకు మ‌చిలీప‌ట్నం కాపు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటికే రాధారంగా మిత్రమం డలి నాయకులు బుల్లెట్ ధర్మారావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో మరోనేత‌, కాపు సామాజిక వర్గంలో బలమై న నేత బిజెపి నుండి జనసేన పార్టీలో చేరేందుకు సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు తెలిసింది. దీంతో ఆయ‌నకు కూడా ప‌వ‌న్ ఢిల్లీ నుంచి రాగానే గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తార‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఒక‌వైపు టిడిపిలో బీసీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పుంజుకుంటుండ‌డం, మ‌రోవైపు.. కాపు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు జ‌న‌సేన వైపు చూస్తుండ‌డం, బల‌మైన నాయ‌కులు ప‌వ‌న్‌కు జై కొడుతుండ‌డంతో మ‌చిలీప‌ట్నం రాజ‌కీయంలో స్ప‌ష్ట‌మైన మార్పులు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామం మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ పేర్ని నానికి సెగ పుట్టిస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని ఆయ‌న ఏవిధంగా ఎదుర్కొంటారో చూడాలి.