రాజాం ర‌చ్చ‌పై చంద్ర‌బాబు క్లారిటీ.. ప్ర‌తిభ వార‌సురాలికి షాక్‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డ‌మే ధ్యేయంగా అడుగులు వేస్తున్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. ఆదిశ‌గా క‌స‌ర‌త్తును ముమ్మ‌రం చేశారు. బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల‌ను, కంచుకోట‌ల‌ను ఎట్టి ప‌రిస్తితిలోనూ వ‌దులుకోకూడ‌దే నిర్ణ‌యానికి ఆయ‌న వ‌చ్చారు. ఈ విష‌యంలో ఆయ‌న ఒకింత క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్పాలి. తాజాగా ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని రాజాం ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి దాదాపు టికెట్ క‌న్ఫ‌ర్మ్ చేసేశారు. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ మంత్రి కోండ్రు ముర‌ళి ఇంచార్జిగా ఉన్నారు.

అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజాం టికెట్‌ను త‌మ‌కు కేటాయించాల‌ని మాజీ స్పీక‌ర్ ప్ర‌తిభా భార‌తి కుమార్తె కావ‌లి గ్రీష్మ కోరుతు న్నారు. ప‌లు సంద‌ర్భాల్లో పార్టీ త‌ర‌ఫున బ‌ల‌మైన గ‌ళం కూడా వినిపిస్తున్నారు. మ‌హానాడు (ఒంగోలులో)లో కూడా తొడ‌గొట్టి మ‌రీ వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. సుదీర్ఘ రాజ‌కీయ‌చ‌రిత్ర ఉన్న కుటుంబం కావ‌డంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు త‌థ్య‌మ‌ని గ్రీష్మ భావించారు. దీనిపై అనేక సార్లు చంద్ర‌బాబుతోనూ ఆమె భేటీ అయి విష‌యం చెప్పారు. ఇక‌, తాజాగా ఈ విష‌యంలో చంద్ర‌బాబు కొంత క‌ఠిన నిర్ణ‌య‌మే తీసుకోవాల్సి వ‌చ్చింది.

ప్ర‌స్తుతం మ‌నం రాక్ష‌సుల‌తో పోరాటం చేయాల్సి వ‌చ్చింది. అందుకే నువ్వేమీ అనుకోకు అని గ్రీష్మ‌కు న‌చ్చజెప్పిన‌ట్టు ఎన్టీఆర్ భ‌వ‌న్ వ‌ర్గాలుచెబుతున్నాయి. ఇక‌, ఈ రాజాం టికెట్‌ను దాదాపు కోండ్రు ముర‌ళికే చంద్ర‌బాబు ఖ‌రారు చేశారు. అయితే.. ఆయ‌న‌ను కూడా చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. అంద‌రినీ క‌లుపుకొని పోవాల‌ని.. అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని చంద్ర‌బాబు ఒకింత గ‌ట్టిగానే సూచించిన‌ట్టు స‌మాచారం. అంతేకాదు.. ప్ర‌తిభా భార‌తి, క‌ళా వెంక‌ట్రావు వ‌ర్గాల‌ను కూడా ఒకే వేదిక‌పైకి తెచ్చేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు.

మీలో మీరు గొడ‌వ‌లు ప‌డితే.. పార్టీ ప‌రిస్థితి ఏంటి? పోనీ.. వేరే వేదిక‌లుఏమైనా ఉన్నాయా? అని ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం. దీనికి వారు మౌనంగా ఉన్నార‌ని.. దీంతో చంద్ర‌బాబు కొన్ని కొన్ని చిన్న చిన్న స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయ‌ని.. కుటుంబం లోనే గొడ‌వ‌లు ఉన్న‌ప్పుడు అతి పెద్ద‌పార్టీలో గొడ‌వ‌లు ఉండ‌కుండా ఉండ‌వ‌ని.. అన్నీ త‌న‌కు తెలుసున‌ని.. స‌ర్దుకుపోయి.. క‌లిసి మెలిసిపార్టీని గెలిపించ‌డ‌మే ధ్యేయంగా ప‌నిచేయాల‌ని సూచించిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాజాం నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ర‌చ్చ‌కు దాదాపు చంద్ర‌బాబు చెక్ పెట్టిన‌ట్టేన‌ని అంటున్నారు టీడీపీ సీనియ‌ర్లు.