మంత్రి సోదరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా ?

మంత్రి సోదరి అయ్యుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి ఒక ఉద్యోగిని రంగం సిద్ధం చేసుకోవటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. విషయం ఏమిటంటే వేముల రాధికారెడ్డి ప్రభుత్వ ఉద్యోగి. వరంగల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణా సాధనలో ఉద్యోగ సంఘాల ఆందోళనల్లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణా రాగానే ఆమె కూడా రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని అనుకున్నా ఎందుకనో అలా జరగలేదు.

అయితే అందరినీ సర్ ప్రైజ్ చేస్తు 2023 ఎన్నికల్లో పోటీలోకి దిగాలని అనుకున్నారు. అనుకోవటమే కాకుండా వీఆర్ఎస్ కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. వేముల రాధిక రెడ్డి అనగానే అర్ధమైపోయుంటుంది మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోదరని. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలని అనుకున్నారు. అయితే వద్దని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు ఒత్తిడి తెస్తున్నారట. ఎందుకంటే ఇపుడు ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఒకే నియోజకవర్గంలో అన్నా చెల్లెళ్ళు పోటీచేస్తే కుటుంబాల్లో గొడవలైపోతాయని అంతా సర్దిచెబుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా కూడా చర్చించారట. వీళ్ళ మధ్య భేటీలో ఏమి చర్చ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా నిజామాబాద్ రూరల్, ఆర్మూర్ నుండి పోటీచేసే విషయాన్ని రాధిక ఆలోచిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. వ్యవహారం చూస్తుంటే రాధికకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేట్లే అనిపిస్తోంది.

రాధిక గనుక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే దీన్ని అడ్డంపెట్టుకుని కాంగ్రెస్ నేతలు మంత్రి ప్రశాంత్ ను ఓ ఆటాడుకోవటం ఖాయం. ఎలాగంటే మంత్రి సోదరే బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న విషయాన్ని బాగా హైలైట్ చేసుకుంటారనటంలో సందేహంలేదు. కేసీయార్ పనితీరు, ప్రభుత్వం సక్రమంగా ఉంటే ఆమె బీఆర్ఎస్ లో కాకుండా కాంగ్రెస్ లో ఎందుకు చేరుతారని హస్తంపార్టీ నేతలంతా ప్రశాంత్ ను కార్నర్ చేయటానికి ప్రయత్నించటం ఖాయం. అప్పుడు ప్రశాంత్ ఏమని సమాధానం చెబుతారు ? రాధిక తన ప్రచారంలో ఏమని ప్రచారం చేస్తారనేది ఆసక్తిగా మారింది.