అరే.. నాలుగోసారీ జగన్ కల నెరవేరలేదే?

ఒక బలమైన నేత.. ప్రజాదరణ పుష్కలంగా ఉన్న అధినేత పాలనా పరంగా ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత అది అమలు కాకుండా ఉంటుందా? అన్న ప్రశ్నను సంధిస్తే.. ఎందుకు సాధ్యం కాదు.. ఇట్టే అయిపోతుందన్న మాట నోటి వెంట రావొచ్చు. కానీ.. అంత తేలికైన విషయం కాదన్న నిజం.. తాజాగా పరిణామాన్ని చూస్తే.. అర్థం కాక మానదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కలగా చెప్పే ఒక పథకం.. ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా.. కార్యకరూపం దాల్చకుండా ఏదో ఒకటి అడ్డుపడటం గమనార్హం.

తాను అధికారంలోకి వస్తే.. పేదలకు ఇంటి పట్టాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించారు. అది కూడా అల్లా టప్పాలా కాకుండా.. ఏకంగా పాతిక లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలిస్తామన్న భారీ మాటను చేతల్లో చేసి చూపించాలని ఆయన కోరుకుంటున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాక.. ఏదో ఒక సాంకేతిక అంశం అడ్డుపడుతోంది.

తాజాగా ఏపీ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ఈ రోజు (బుధవారం) తప్పనిసరిగా కోర్టు విచారణకు వస్తుందని.. దీంతో పంద్రాగస్టున పాతిక లక్షల పేదలకు ఇళ్ల స్థలాల్ని ఉచితంగా పంపిణీ చేయాలన్న జగన్ కల నెరవేరుతుందని భావించారు. కానీ.. కోర్టు ముందుకు ఈ పిటిషన్ విచారణకు రాకపోవటంతో.. ఆయన తన నిర్నయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ కార్యక్రమం ఇప్పటికి నాలుగుసార్లు వాయిదా పడటం.

తాజాగా చెబుతున్న దాని ప్రకారం.. పేదలకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించి సుప్రీంలో ఉన్న కేసు కొలిక్కి వస్తే తప్పించి.. పంపిణీ సాధ్యం కాదని చెబుతున్నారు. ప్రభుత్వం కోరుకున్న కన్వేయెన్సు డీడ్ లకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుందని.. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు. అసైన్ మెంట్ చట్ట నిబంధనలకు అనుగుణంగా పేదలకు డీకేటీ పట్టాలుగా కాకుండా కన్వేయెన్స్ డీడ్ లుగా ఇంటి పట్టాలు ఇస్తామని ఫిబ్రవరిలో జారీ చేసిన జీవో 44లో పేర్కొంది. దీని ప్రకారం 28 ఏళ్ల నిర్దిష్ట కాలపరిమితి వరకు అమ్మటానికి వీల్లేదు.

అయితే.. వాటిని కన్వేయెన్స్ డీడ్ ల కింద ఇస్తే.. ఇంటి పట్టాల్ని పదేళ్ల తర్వాత అవసరానికి తగ్గట్లు అమ్ముకునే వెసులుబాటు ఉంటుంది. కన్వేయెన్స్ డీడ్ లనుఏ చట్ట పరిధిలో ఇస్తారు.. దీనికి ఉన్న హేతుబద్ధత ఏమిటి? అన్న హైకోర్టు ప్రశ్నలకు రెవెన్యూ శాఖ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. ఉగాది వేళ.. పట్టాలు ఇద్దామనుకుంటే సాధ్యం కాలేదు. ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం భావించింది. అయితే.. అది కూడా సాధ్యం కాలేదు.

మూడోసారి వైఎస్సార్ జయంతి సందర్భగా చేపట్టాలని అనుకున్నా.. అది కూడా సాధ్యం కాలేదు. నాలుగోసారి.. ఈ 15న (పంద్రాగస్టు) ఇవ్వాలని భావించారు. సుప్రీంకోర్టులో ఈ కేసు లెక్క తేలిపోతుందని భావించారు. కానీ.. కాకపోవటంతో.. మరోసారి వాయిదా పడింది. దీంతో.. జగన్ కలల పథకంగా చెప్పే ఈ వ్యవహారం ప్రభుత్వం కోరుకున్నట్లు ఎప్పటికి పూర్తి అవుతుందన్నది ప్రశ్నగా మారింది. తిరుగులేని రాజకీయ బలం ఉన్నా.. చేతిలో అధికారం ఉన్నా.. సాంకేతిక అంశాలు సహకరిస్తే తప్పించి..ప్రభుత్వాధినేత కల నెరవేరేలా లేదని చెప్పకతప్పదు.