జ‌గ‌న్ ప్ర‌భుత్వం బీజేపీ మంత్రులు.. అదిరిపోయే ఆఫ‌ర్‌!

ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. పొత్తులు పెట్టుకునేందుకు టీడీపీ-జ‌నసేన సిద్ధంగానే ఉన్నాయి. అయితే.. ఎన్నికల మేనేజ్ మెంట్ విష‌యంలో అంతో ఇంతో సాయం చేస్తుంద‌నే ఉద్దేశంతో ఓటు బ్యాంకు లేక‌పోయినా.. బీజేపీతో పొత్తుకు ఈ రెండు పార్టీలు ఎదురు చూస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంలో బీజేపీ ఇప్ప‌టి వ‌ర‌కు ఏమీ తేల్చ‌లేదు. పైగా.. ఇప్పుడు ఢిల్లీలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్న‌ట్టు ప‌క్కాగా తెలుస్తోంది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ ప్ర‌భుత్వం కొలువు దీరాలంటే.. ఒంట‌రి విజ‌యం సాధ్యంకాద‌నే అంచ‌నాలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో బల‌మైన ప్రాంతీయ పార్టీల‌తో ముందుకు సాగాల‌నే వ్యూహాన్ని క‌మ‌ల నాథులు అనుస‌రిస్తున్న‌ట్టు స‌మాచారం. ఏపీ విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికిప్పుడు బ‌ల‌మైన పార్టీ వైసీపీనే. 46 మంది ఎంపీల‌తో(లోక్‌స‌భ‌+రాజ్య‌స‌భ‌) వైసీపీ బ‌లంగానే ఉంది. ఇలాంటి పార్టీని వ‌దులుకునేందుకు బీజేపీ సిద్ధంగా లేదని ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఇక‌, ఇదే అదునుగా వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా బీజేపీని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని అంటున్నారు. తాజాగా ఆయ‌న కేంద్ర మంత్రి అమిత్ షా వ‌ద్ద ఒక ప్ర‌తిపాద‌న పెట్టిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు ఒంట‌రిగా పోటీ చేయండి.. అయితే.. ఎన్నిక‌ల త‌ర్వాత మీకు మేం మ‌ద్ద‌తిస్తాం. అంతేకాదు.. ప్ర‌భుత్వంలోనూ మేం మీకు అవ‌కాశం క‌ల్పిస్తాం.. రెండు నుంచి మూడు మంత్రి ప‌ద‌వులు కూడా ఇస్తాం.. అని జ‌గ‌న్ ఆఫ‌ర్ ఇచ్చిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.

అంటే.. బీజేపీని టీడీపీ+జ‌న‌సేన‌తో క‌ల‌వ‌కూడ‌ద‌నే విధంగా జ‌గ‌న్ మంత్రాంగం చేసిన‌ట్టు ప‌క్కాగా తెలుస్తోంది. అంతేకాదు.. మీరు గెలిస్తే.. వ‌చ్చే స్థానాల కంటే కూడా.. మీరు ఒంట‌రిపోరుతో ఎలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొన్నా.. మా ప్ర‌భుత్వం రాగానే మీ నేత‌ల‌కు ఛాన్స్ ఇస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పిన‌ట్టు చెబుతున్నారు. ఇక‌, కేంద్రంలోనూ ఎంపీల‌తో య‌థాత‌థంగా పొత్తు ఉంటుంద‌ని ఈ విష‌యంలో స‌హ‌క‌రించాల‌ని కూడా జ‌గన్ అభ్య‌ర్థించిన‌ట్టు తాజాగా వెలుగు చూసింది. దీనికి బీజేపీ నేత‌లు కూడా సూత్ర ప్రాయంగా అంగీక‌రించార‌నేది తాజా వార్తం. అయితే.. దీనిలో నిజానిజాలు తెలియాలంటే కొంత వెయిట్ చేయ‌క‌త‌ప్ప‌దు.