నేను ముఖ్య‌మంత్రి కావ‌డం ప‌రిష్కారం కాదు.. : ప‌వ‌న్

“నేను ముఖ్య‌మంత్రి కావాల‌ని మీకే కాదు..నాకు కూడా ఉంది. కానీ, నేను ముఖ్య‌మంత్రి అయినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు” అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమవరంలో తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. తాను సీఎం అయితే.. ఏదో ఒరిగిపోతుంద‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్నారు. అయితే.. తాము అధికారంలోకి వ‌స్తే.. కొంత మేలు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు.

కాపుల్లో తూర్పుకాపులు చాలా వెనుక బ‌డ్డార‌ని.. అస‌లు వారు ఎందరు ఉన్నానేది కూడా ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర స‌రైన లెక్క‌లు లేవ‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే తూర్పు కాపుల‌ జనగణన చేపడతామన్నారు.  చట్టంతో అందరికీ న్యాయం జరిగితే.. కులాలతో సంబంధం లేదని, చట్టం పనిచేయనప్పుడు కులాల వైపు చూస్తార‌ని చెప్పారు. తూర్పుకాపుల్లో బలమైన నాయకులు ఉన్నారని.. వారు ఎదుగుతున్నారు.. కులాన్ని పట్టించుకోవడం లేదన్నది మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఆలోచించాలని విమ‌ర్శించారు.

“తూర్పుకాపుల్లో మంత్రులు ఉన్నారు.. ఎమ్మెల్యేలు ఉన్నారు.. వారు తిన్నాకైనా వారి కులం గురించి ఆలోచించాలి. ఇతర బీసీ కులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సర్టిఫికెట్లు ఇస్తున్నప్పుడు, తూర్పుకాపులకు ఎందుకు ఇవ్వరు?  ఇవ్వకపోవడానికి హేతుబద్ధత ఏంటి“ అని ప‌వ‌న్ నిల‌దీశారు. తూర్పు కాపుల సంక్షేమానికి తాము అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తామ‌ని  పవన్ అన్నారు. దీనికి జ‌న‌సేన బాధ్య‌త తీసుకుంటుంద‌ని చెప్పారు. త‌న పోరాట యాత్ర 2014లో శ్రీకాకుళం నుంచే మొదలుపెట్టానని తెలిపారు.

బొత్స గారు తెలుసుకోవాలి..

“మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు ఒక్క‌టే చెబుతున్నా.. ఆయ‌న ఒక విష‌యం తెలుసుకోవాలి. ఉత్తరాంధ్ర నుంచే ఎక్కువ వలస కార్మికులు వస్తున్నారు. వారిలోనూ తూర్పు కాపులు ఎక్కువ‌గా ఉన్నారు.తూర్పు కాపుల సంఖ్యను టీడీపీ 26 లక్షలని, వైసీపీ ప్రభుత్వం 16 లక్షలని చెబుతోందని.. కానీ వారు 45 లక్షల మంది ఉన్నారు” అని అన్నారు. ఇంత‌మందిని జ‌గ‌న్ గాలికి వ‌దిలేశార‌ని దుయ్య‌బ‌ట్టారు.

తెలంగాణ‌లోనూ అన్యాయం చేశారు.,

తెలంగాణాలోనూ తూర్పు కాపుల‌కు అన్యాయం జ‌రిగింద‌ని ప‌వ‌న్ అన్నారు. ఆ రాష్ట్రంలో 31 కులాల బీసీ జాబితా నుంచి తూర్పు కాపులను తొలగించారని చెప్పారు.  అయినా నాయకులు పట్టించుకోలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బీసీ కులాల జనగణనకు అనుకూలంగా ఉన్నానని పవన్ తెలిపారు. “మ‌ళ్లీ చెబుతున్నా నేను సీఎం అయితే అన్నింటికి పరిష్కారం కాదు.  సీఎం అవ్వడం అన్నింటికీ మంత్రదండం కాదు. నేను సీఎం అయిన తరువాత చేయాలనుకున్నా.. అధికారులో, నాయకులో అడ్డుపడతారు. చైతన్యవంతమైన సమాజంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది“ అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.