యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి జగన్ మాస్టర్ ప్లాన్

జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉన్నా, రాష్ట్రం ఆర్థికంగా ఎంత వెనుకబడిపోతున్నా, అభివృద్ధి కనుచూపుమేరలో కూడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం జగన్‌ టాలెంట్‌ను పొగడక తప్పదు. అది.. జనాన్ని మాయ చేయడం, ఆకర్షించడం.. ఈ విషయంలో ఆయన చాలా ముందుంటారు. ఉద్యోగాలు లేక, ఉపాధి దొరక్క, నిరుద్యోగ భృతి కూడా అందక నానా తిప్పలు పడుతున్న ఆంధ్ర యువత రానున్న ఎన్నికలలో జగన్‌కు ఓటేయడం అనేది కలే అనుకుంటున్నారు అంతా.. కానీ, జగన్ మాత్రం యువత ఓట్ల కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వకపోయినా, ఉపాధి చూపకపోయినా కూడా తనకు ఓట్లు వేసేలా చేసుకోవాలని ఆయన ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగమే ‘ఆడదాం ఆంధ్ర’ ప్రోగ్రాం.

అవును.. ఆడదాం ఆంధ్ర పేరుతో అక్టోబరు 2 నుంచి భారీ స్థాయిలో క్రీడా సంబరాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని జగన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలను అనుసరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అందుకు తగ్గ ఏర్పాట్లు మొదలుపెట్టారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రోగ్రాంలో క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ వంటి ఆటల పోటీలు, టోర్నీలు నిర్వహిస్తారు. దీని కోసం గ్రౌండ్లు గుర్తించి డెవలప్ చేయబోతున్నారు.

ఇదేదే అధికారులు తూతూమంత్రంగా నిర్వహించే కార్యక్రమం అనుకోవడానికి వీల్లేదు.. ఇందులో ప్రధానంగా క్రికెట్, బ్యాడ్మింటన్‌పై ఫోకస్ ఉంటుంది. ఈమధ్యే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి వైసీపీకి దగ్గరవుతున్న క్రికెటర్ అంబటి రాయుడు ఇందులో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతున్నారు. జవహర్ రెడ్డి రీసెంటుగా ఈ ప్రోగ్రాంపై నిర్వహించిన సమావేశంలో కూడా అంబటి రాయుడు పార్టిసిపేట్ చేసి ఎలా చేయాలి.. ఏం చేయాలనేది సూచనలు ఇచ్చినట్లుగా సమాచారం.

చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడిగా, ఏపీకి చెందిన డాషింగ్ క్రికెటర్‌గా ఏపీ యువతలో రాయుడికి అభిమానులు ఉన్నారు. సరిగ్గా ఆ అభిమానాన్నే వాడుకోవాలన్నది జగన్ ప్లాన్. రాయుడును ముందుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడిన ఒకరిద్దరు ఆటగాళ్లను కూడా ఎలక్షన్ ప్రచారానికి తేవాలన్నది జగన్ ముందు చూపుగా తెలుస్తోంది. బీసీసీఐ కాంట్రాక్ట్‌లో లేకుంటే ఎన్నికల ప్రచారానికి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి స్టార్ ఫేస్‌లను రాయుడు ద్వారా కాన్వాసింగ్‌కు తేవాలన్నది జగన్ ప్లాన్. నేరుగా ఎన్నికల ప్రచారం అన్నట్లుగా కాకుండా ఈ ఆడదాం ఆంధ్ర కార్యక్రమాలలో పాల్గొనడం.. ఆ సందర్భంగా స్థానిక నాయకులతోను , రాష్ట్ర స్థాయిలో జగన్‌తోనూ ప్రముఖ క్రికెటర్లు వేదిక పంచుకోవడం వంటివి ఉంటాయి. ఇవన్నీ తెలియకుండానే యువతను అట్రాక్ట్ చేస్తాయన్నది జగన్ ప్లాన్.

అంతేకాదు.. ఇటీవల రాయుడు జగన్‌ను కలిసినప్పుడు కూడా ఐపీఎల్ ప్రస్తావన వచ్చినట్లు చెప్తున్నారు. ఏపీకి ఐపీఎల్ జట్టు ఎందుకు ఉండకూడదు.. రాష్ట్రం నుంచి ఐపీఎల్ ఫ్రాంచైజీ ఏర్పాటు చేద్దాంఅన్నట్లు చర్చించారని ప్రచారం ఒకటి జరుగుతుంది. ఐపీఎల్ జట్టు జగన్ వల్ల అయినా కాకపోయినా ఎన్నికల సమయంలో అలాంటి ప్రతిపాదన ఒకటి బాగా పాపులర్ చేసి యూత్‌ను, ముఖ్యంగా క్రికెట్ లవర్స్‌ను అట్రాక్ట్ చేయాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.