మార్గదర్శి ఖాతాదారులను రేప్ బాధితులతో పోలికా?

మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అవకతవకలు జరిగాయంటూ రామోజీరావుతో పాటు ఆయన కోడలు శైలజ కిరణ్ ల పై ఏపీ సిఐడి విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే రామోజీరావుతో పాటు శైలజా కిరణ్ ను కూడా సిఐడి అధికారులు హైదరాబాద్ లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రామోజీరావు, శైలజ కిరణ్ లకు సీఐడీ అది అధికారులు సెక్షన్ 41ఏ కింద తాజాగా నోటీసులిచ్చారు. జూలై 5న గుంటూరులోని సిఐడి రీజినల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. ఈ కేసులో ఏ-1గా రామోజీరావు, ఏ-2గా శైలజా కిరణ్ ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు, మార్గదర్శి కుంభకోణం అతి పెద్దదిగా సిఐడి అభివర్ణిస్తోంది. మార్గదర్శికి చెందిన 23 చిట్ గ్రూపులను ఏపీ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ శాఖ నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్గదర్శక చెందిన 9 శాఖలలో అవకతవకలు జరిగినట్టుగా సిఐడి ఆరోపిస్తోంది. మార్చి 10న కేసు దర్యాప్తు చేపట్టిన ఏపీ సిఐడి ఇప్పటివరకు 7 ఎఫ్ఐఆర్ లు నమోదు చేసింది.

ఈ క్రమంలోనే మార్గదర్శికి చెందిన లక్షలాది చందాదారులను అత్యాచారానికి గురైన మైనర్ బాలికలతో ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ పోల్చడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సంజయ్ పై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత మండిపడ్డారు. అత్యాచారానికి గురైనవారి మానసిక స్థితి, ఆ కుటుంబం కుంగుబాటు మీకేమైనా తెలుసా అంటూ సంజయ్ పై అనిత ఫైర్ అయ్యారు. మీ ఇంట్లో, పోలీస్ విభాగంలో మహిళలు లేరా అని ప్రశ్నించారు.

మార్గదర్శి వ్యవహారంలో చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఇటువంటి పోలికలు తెస్తున్నారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై జరిగిన అఘాయిత్యాల గురించి ఒక పుస్తకమే ప్రింట్ చేసి ఫిర్యాదు చేశామని, ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మహిళలంటే సంజయ్ కి ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాను సిఐడి చీఫ్ అని, ఐపీఎస్ అధికారిని అని సంజయ్ మర్చిపోయారని, ఐపీసీ సెక్షన్ల కంటే వైసీపీ సెక్షన్లకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని విమర్శించారు. మార్గదర్శి సంస్థకి ఎండీగా ఉన్న మహిళ గురించి ఏకవచనంతో సంబోధించడాన్ని తప్పుబట్టారు.