జగన్ ప్రకటనలో లాజిక్కుందా ?

పల్నాడులో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ మద్దతు కూడా ఉండదన్నారు. నిజానికి బీజేపీ-వైసీపీ మిత్రపక్షాలేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మంచి సఖ్యత లేదా అవగాహన ఉందన్నది వాస్తవం. మొదట్లో జగన్ విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా కొంతకాలంగా బాగానే మద్దతిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి సుమారు రు. 24 వేల కోట్లు విడుదల చేయటం అంటే మామూలు విషయంకాదు.

ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న రెవిన్యులోటు రు. 10 వేల కోట్లు, పోలవరం పెండింగ్ బకాయిలు సుమారు రు. 13 వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. తాజాగా జీఎస్టీ వసూళ్ళల్లో ఏపీ షేర్ కింద రు. 4500 కోట్లను విడుదలచేసింది. ఒకవైపు కేంద్రం నుండి ఇంతస్ధాయిలో మద్దతు అందుకుంటు మళ్ళీ బీజేపీ మద్దతు కూడా తనకుండదని జగన్ చెప్పటంలో లాజిక్ కనబడటంలేదు. పార్టీలపరంగా రెండు వేర్వేరు కావచ్చుకానీ ప్రభుత్వాల పరంగా బాగానే సఖ్యతతోనే ఉంటున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ వేరు కేంద్రప్రభుత్వం వేరుకాదు. జగన్మోహన్ రెడ్డి వేరు వైసీపీ వేరని, చంద్రబాబునాయుడు వేరు తెలుగుదేశంపార్టీ వేరంటే జనాలు అంగీకరిస్తారా ? అలాగే బీజేపీ అన్నా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం వేర్వేరు కాదని అందరికీ తెలుసు. సడెన్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు తమ బహిరంగసభల్లో జగన్ను టార్గెట్ చేసుకున్నారు.

ఇదే సమయంలో జగన్ మాత్రం బీజేపీని టార్గెట్ చేశారు. అదికూడా తనకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సపోర్టుందని అన్నారంతే. అంటే జగన్ ఉద్దేశ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని కావచ్చు. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా కాకుండా ఇన్ డైరెక్టుగా ప్రస్తావించారు. చూస్తుంటే ముందుముందు జరగబోయే సభల్లో బీజేపీని జగన్ డైరెక్టుగానే ఎటాక్ చేస్తారనే అనిపిస్తోంది. అటు బీజేపీ వైపునుండి ఇటు వైసీపీ నుండి ఎటాకులు పెరిగిపోతే జనాలు ఆ వేడికి తట్టుకోలేరేమో.