మార్గదర్శి కేసు ముగియలేదు… రామోజీకి సుప్రీం నోటీసులు

మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్ల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో రామోజీ గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుకు తాజాగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. రామోజీతో పాటు మార్గదర్శి ఫైనాన్షియర్స్, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంకు, మాజీ ఐజీ కృష్ణంరాజులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వెరసి గతంలో రామోజీని నానా ఇబ్బందులు పెట్టిన ఈ కేసు అప్పుడే ముగియలేదన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి.

మార్గదర్శి పైనాన్షియర్స్ కేసును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేయడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పిటీషన్ వేశారు. ఉండవల్లి పిటిషన్‌ను విచారించిన జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తాజాగా ఈ నోటీసులు జారీ చేసింది. ఇక రిజర్వు బ్యాంక్, మాజీ ఐజీ కృష్ణంరాజులను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ చేయాలన్న ఉండవల్లి విజ్ఝప్తికి కూడా సుప్రీంకోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ నోటీసులకు లిఖిత పూర్వక సమాధానాలు దాఖలు చేసిన తర్వాత తదుపరి విచారణ చేపట్టనునున్నట్లు ధర్మాసనం తెలిపింది.

కాగా, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) చట్టం నిబంధనలకు విరుద్ధంగా 2,600 కోట్ల రూపాయలను సుమారు రెండున్నర లక్షల మంది నుంచి రామోజీరావు డిపాజిట్ల రూపంలో సేకరించారని మాజీ ఐజీ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. కాగా, ఉమ్మడి హిందూ కుటుంబం(హెచ్‌యూఎఫ్) ద్వారా డిపాజిట్లు సేకరించడం చట్టరీత్యా నేరం కాదని ఉమ్మడి హైకోర్టు ముందు రామోజీరావు వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కేసును కొట్టివేసింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన ఉండవల్లి… మరోమారు ఈ కేసును తెర మీదకు తీసుకొచ్చారు. మరి ఈ కేసు విచారణ ఎలా సాగనుంది?, ఉండవల్లి ఆరోపిస్తున్నట్లుగా రామోజీ అక్రమాలకు పాల్పడ్డారన్న విషయంపై కోర్టు ఏమంటుంది? అన్న విషయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి.