వివేకా దారుణ హ‌త్య‌లో నిందితులు ఊహించని ట్విస్ట్ ఇది

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. ఆయ‌న దారుణ హ‌త్య‌కు ముందు రాసిన లేఖ నిజాలు చెప్ప‌నుంది. ఈ లేఖలో దాగిన నిగూఢ వేలిముద్రలున్నాయేమో గుర్తించడానికి దాన్ని నిన్‌హైడ్రిన్‌ పరీక్షకు పంపాలన్న సీబీఐ అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఆమోదం తెలిపింది. లేఖ‌ను పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ పంపాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సానుకూల తీర్పు ఇచ్చింది.

నిన్‌హైడ్రిన్‌ పరీక్షల్లో భాగంగా అసలు లేఖ దెబ్బతిన్నా, అందులోని రాత చెరిగిపోయినా ప్రత్యామ్నాయ సాక్ష్యం నిమిత్తం సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేయాల్సి ఉంది. అవసరమైనన్ని సర్టిఫైడ్‌ కాపీలను సిద్ధం చేసుకోవడానికి వీలుగా వివేకా రాసిన అసలు లేఖను కోర్టుకు సమర్పించాలని న్యాయ‌మూర్తి ఆదేశించారు. నిన్‌హైడ్రిన్‌ పరీక్షలో కాగితంపై ఉన్న ఇంకు చెరిగిపోయే అవకాశం ఉన్నందున ముందస్తు అనుమతి కోరుతూ సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

లేఖ‌లో ఏముంది?

తెల్లటి కాయితంపై బ్లూ ఇంక్ పెన్నుతో అత్యంత హ‌డావుడిగా కెలికిన‌ట్టుగా రాసిన అక్ష‌రాలు.. మ‌ధ్య మ‌ధ్య ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌తో కూడిన లేఖ వివేకా హత్య కేసులో సంచ‌ల‌నంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిలో ఏముందంటే.. తన హత్యకు డ్రైవర్‌ ప్రసాద్‌ కారణమని, అతణ్ని వదిలిపెట్టరాదంటూ చనిపోయే ముందు వివేకా రాసినట్టుగా ఉంది. ఈ లేఖను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆయన ఈ లేఖను ఇష్టపూర్వకంగా రాశారా లేదంటే ఎవరిదైనా ఒత్తిడితో, బలవంతంగా రాశారో పరిశీలించాలంటూ 2021 అక్టోబరులో సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపింది.

వివేకా గత చేతి రాతతో ఈ లేఖను పోల్చి చూసిన సీఎఫ్‌ఎస్‌ఎల్‌.. దాన్ని బలవంతంగా రాయించినట్లు ధ్రువీకరించింది. ఈ విషయాన్ని అవినాష్‌రెడ్డి పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. లేఖపై వివేకావి కాకుండా ఇంకెవరివైనా వేలిముద్రలు ఉన్నాయేమో నిన్‌హైడ్రిన్‌ పరీక్ష నిర్వహించి తేల్చాలని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ను సీబీఐ అప్పట్లోనే కోరింది. ఏవైనా వేలిముద్రలు బయటపడితే వాటిని నిందితుల వేలిముద్రలతో పోల్చి చూసి, దర్యాప్తును ముందుకు వెళ్తామ‌ని తెలిపింది.

అయితే నిన్‌హైడ్రిన్‌ పరీక్ష ద్వారా వేలిముద్రలను గుర్తించడానికి ప్రయత్నిస్తే కాగితంలోని వేలిముద్రలపై ప్రభావం పడుతుందని సీఎఫ్‌ఎస్‌ఎల్‌ సీబీఐకి లేఖ రాసింది. తదనంతర దర్యాప్తులో అప్రూవర్‌గా మారిన షేక్‌ దస్తగిరి.. నిందితులు వివేకాతో బలవంతంగా లేఖ రాయించినట్లు సీబీఐకి వెల్లడించారు. ఈ క్రమంలో కోర్టు పరీక్షకు అనుమతివ్వ‌డంతో లేఖలో దాగిన అస‌లు నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని సీబీఐ అధికారులు చెబుతున్నారు.