నువ్వు న‌న్ను-నేను నిన్ను: బైడెన్‌-మోడీ రాజ‌కీయం

ఇటీవ‌ల కాలంలో అగ్ర‌రాజ్యం అమెరికాకు, భార‌త్‌కు మ‌ధ్య కొన్ని కొన్ని విష‌యాల్లో సారూప్య‌త క‌నిపిస్తోంది. నువ్వు న‌న్ను పొడిగితే.. నేను నిన్ను పొగుడుతా! అన్న క్విడ్ ప్రోకో పొగ‌డ్త‌లు క‌నిపిస్తున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ఇటీవ‌ల ప్ర‌ధాని మోడీ అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే.. వాస్త‌వానికి అక్క‌డ ప్ర‌భుత్వం జీతాలు ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉంది. అద‌న‌పు అప్పు కోసం కాంగ్రెస్ ఒప్పుకోలేదు. దీంతో మొత్తానికి తంటాలు ప‌డి అప్పు తెచ్చుకున్నారు.

ఇక‌, ఇప్పుడు భార‌త్‌ను అమెరికా ఓ రేంజ్‌లో ఆకాశానికి ఎత్తేసింది. భారత్‌ లోని ప్రజాస్వామ్యానికి అమెరికా అధ్యక్ష భవనం నుంచి అద్భుతమైన ప్రశంస లభించింది. భారత్‌ చైతన్యవంతమైన ప్రజాస్వామ్య దేశమని.. ఎవరైనా సరే ఢిల్లీ వెళ్లి ఈ విషయాన్ని స్వయంగా తెలుసుకోవచ్చని శ్వేతసౌధం జాతీయ భద్రతా సలహామండలి సమన్వయకర్త జాన్‌ కెర్బీ(బైడెన్ త‌ర‌ఫున‌) పేర్కొన్నారు. ఆరోగ్యవంతమైన చర్చలోనే ప్రజాస్వామ్య సంస్థల బలం ఉంటుందని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

“చూడండి.. ప్రపంచంలోనే ఎవరితోనైనా సరే ఆందోళనకరమైన విషయాలు ఉంటే వెల్లడించడానికి మేము ఎప్పుడూ సిగ్గుపడం. త్వరలో జరగబోయే పర్యటన (మోడీ అమెరికా పర్యటనను ఉద్దేశిస్తూ) ఇరు దేశాల సంబంధాలను మరింత లోతుగా, బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించింది. మీరు చూశారుగా.. ఆస్టిన్‌ (అమెరికా రక్షణ మంత్రి) ఇప్పటికే షంగ్రిలా సదస్సులో భారత్‌తో అమెరికా అదనపు రక్షణ సహకారానికి సంబంధించిన పలు అంశాలను ప్రకటించారు. భారత్‌ క్వాడ్‌లో సభ్య దేశం. ఇండో-పసిఫిక్‌ వ్యూహంలో భారత్‌ చాలా కీలకమైన భాగస్వామి.” అని పొగ‌డ్త‌లు గుప్పించారు.

“ఈ సంబంధాలు మా ఇరు దేశాలకు మాత్రమే ముఖ్యమైనవి కాదు.. బహుముఖంగా చాలా దశల్లో కీలకమైనవి. అందుకే ప్రధాని మోడీతో ఈ అంశాలు మొత్తం చర్చించి.. బంధాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు అధ్యక్షుడు బైడెన్‌ ఎదురు చూస్తున్నా రు” అని వివరించారు. మరోవైపు రక్షణ రంగంలో పారిశ్రామిక సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా భారత్‌, అమెరికా తాజాగా ప్రత్యేక రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నాయి. ఈ ప్రణాళికలో భాగంగా పలు మిలిటరీ ప్లాట్‌ఫాంలు, హార్డ్‌వేర్‌లను సంయుక్తంగా అభివృద్ధి చేసే ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. సో.. ఏది ఎలా ఉన్నా.. మోడీ-బైడెన్‌ల ప్రశంస‌ల ప‌ర్వం మాత్రం కొన‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.