శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ వెనుక ఇంత జరిగిందా?

థ్రిలర్ సినిమా చూస్తున్న ప్రేక్షకుడు.. అంతకూ అంతుచిక్కనిగా ఉండే కథలోని చిక్కుముడిని ముందుగా అంచనా వేస్తే.. సదరు సినీ దర్శకుడు ఫెయిల్ అయినట్లే. అందులో వేరే మాట లేదు. ఎత్తులు.. పైఎత్తులతో సాగే రియల్ రాజకీయ థ్రిల్లర్ లో చోటు చేసుకునే పరిణామాలు అందరికి అర్థమయ్యేలా ఉంటే అది వైఫల్యం కాక మరేంటి? అందరు అనుకున్నదే నిజమైతే అది రాజకీయం ఎందుకు అవుతుంది? తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారి.. అందరూ మాట్లాడుకునేలా చేస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలక పరిణామాలు ఇటీవల చోటు చేసుకున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు అయిన శరత్ చంద్రారెడ్డి ఆ మధ్యన బెయిల్ మీద బయటకు రావటం.. అంతలోనే ఆయన ఈ వ్యవహారంలో అప్రూవర్ గా మారేందుకు నిర్ణయించుకోవటం వెనుక చాలానే జరిగిందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అందరు అనుకున్నట్లుగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారినంతనే ముప్పు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు ఉంటుందన్న అంచనాలో ఏ మాత్రం నిజం లేదన్నది చెబుతున్నారు.

కవితను అరెస్టు చేయటం కన్నా.. మోడీ అండ్ కోకు పెద్ద టాస్కే ఉందంటున్నారు. లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయటం ద్వారా కలిగే రాజకీయ ప్రయోజనంతో పోలిస్తే.. అంతకు మించిన వాటి మీద మోడీషాలు గురి పెట్టినట్లు చెబుతున్నారు. అందరి అంచనాలకు భిన్నంగా శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన అసలు కారణం రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.శరత్ అప్రూవర్ గా మారింది ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను టార్గెట్ చేసేందుకన్న చేదు నిజం బయటకు వచ్చింది.
ఇప్పటికే బీజేపీ హైకమాండ్ కు కంట్లో నలకగా మారిన క్రేజీవాల్ కు సరైన రీతిలో చెక్ పెట్టాలన్నది మోడీషాలు వెతుకుతుండగా.. వారికి అనుకోని వరంలా ఢిల్లీ లిక్కర్ స్కాం దొరికిందని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి.. పని చేసే దిశగా కేజ్రీవాల్ ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో.. అలాంటిది జరగకుండా ఉండేందుకు మోడీ అండ్ కో భారీ ఆఫర్ ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

శరత్ ను అఫ్రూవర్ గా మార్చేయటం.. అదే సమయంలో ఢిల్లీ సీఎంపై కొత్త ఆరోపణలతో ఆయన్ను అడ్డు తొలగించుకోవాలన్నదే అసలు ప్లాన్ గా చెబుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం.. త్వరలో కేజ్రీవాల్ కు చిక్కులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే.. ఆయనకు శ్రీక్రిష్ణజన్మస్థానంగా చెబుతున్నారు. తామింత చేసిన దానికి బదులుగా కేసీఆర్ కుమార్తె కవిత విషయాన్ని వదిలేసినట్లుగా చెబుతున్నారు. అందుకు తెర వెనుక మరిన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని.. త్వరలోనే బయటకు వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. మరి.. ఈ వాదన నిజమన్నది తేలాలంటే.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ కు అనూహ్య కష్టాలు ఎదురు కావాల్సిందే. మరెప్పుడు జరుగుతుందో చూడాలి.