ముగిసిన అవినాష్ విచార‌ణ‌.. వాట్సాప్ చుట్టూ ప్ర‌శ్న‌లు?

Viveka

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో మొద‌ట్లో సాక్షిగా, త‌ర్వాత‌.. నిందితుడి గా సీబీఐ న‌మోదు చేసిన క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని తాజాగా సీబీఐ అధికారులు విచారించారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేర‌కు.. ప్ర‌తి శ‌నివారం ఆయ‌న స్వ‌యంగా సీబీఐ అధికారుల ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆదేశాలు వ‌చ్చిన ద‌రిమిలా తొలి శ‌నివారం(3వ తేదీ) ఆయ‌న సీబీఐ అధికారుల ముందు హాజ‌ర‌య్యారు.

ఉదయం 10 గంటలకు అవినాశ్ సీబీఐ ఎదుట హాజరయ్యారు. సాయంత్రం 4.30 గంటలకు విచారణ ముగిసింది. అయితే.. ఇప్ప‌టికే ఐదు సార్లు విచారించిన సీబీఐ అధికారులు తాజా విచార‌ణ‌లో మాత్రం వాట్సప్ కాల్స్, నిందితులతో పరిచయాలపై ప్ర‌ధానంగా ప్రశ్నించినట్లు సమాచారం. అడిషనల్ ఎస్పీ స్థాయిలో అధికారి సమక్షంలో విచారణ జ‌రిగింది. విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియోలు సీబీఐ అధికారులు చిత్రీకరించారు. వివేకా దారుణ‌ హత్యకు వినియోగించిన‌ గొడ్డలిపై కూడా సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

సునీల్ యాదవ్ గొడ్డలి దాచిన విషయంపై ఆరా తీసిన‌ట్టు స‌మాచారం. వివేకా మరణంపై జగన్ మోహన్ రెడ్డికి ముందుగా ఎవరు చెప్పారన్న విషయాన్ని కూడా ఈ సంద‌ర్భంగా సీబీఐ ప్ర‌శ్నించిన‌ట్టు తెలిసింది. అయితే, తనకు, ఈ హత్యకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్‌రెడ్డి సీబీఐ అధికారుల‌కు గ‌తంలో చెప్పిన‌ట్టే ఇప్పుడు కూడా చెప్పినట్లు తెలుస్తోంది. అవినాష్ స్టేట్‌మెంట్‌ను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. అవినాష్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందుస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4.30 వరకూ ఆయనను విచారించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ తల్లి అనారోగ్యం దృష్ట్యా ఇటీవల తెలంగాణ హైకోర్టు మే 31 వరకూ అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని సీబీఐని గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ముందస్తు బెయిల్ పొందిన అవినాష్ రెడ్డి.. ప్ర‌తి శ‌నివారం విచార‌ణ‌కు విధిగా హాజ‌రు కావాల‌ని ఆదేశించింది.