కేసీఆర్ ను జగన్ మోసం చేశారా?

సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. తరచూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారే వైసీపీ రెబల్ లోక్ సభ సభ్యులు రఘురామ క్రిష్ణరాజు తాజాగా మరోసారి తన నోటికి పని చెప్పారు. కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నంతనే సీన్లోకి వచ్చేసే ఎంపీ రఘు రామ.. ఢిల్లీ మద్యం కేసులో అరబిందో ఫార్మా డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారిన నేపథ్యంలో.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

మద్యం కేసులో కొందరి పాత్రను వెల్లడిస్తే.. వివేకా కేసులో కీలక వ్యక్తి పేరు బయటకు రాకుండా చూస్తామని కొందరు చెప్పినట్లుగా వార్తలు వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. “తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉన్నట్లుగా సాక్షి పత్రికలో కథనాన్ని రాశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా అరెస్టు అయి.. బెయిల్ పొందిన శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారారు. ఆయన అఫ్రూవర్ గా మారబోతున్నట్లుగా రెండురోజుల క్రితమే పత్రికల్లో వచ్చింది. అదే నిజమైంది” అని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో తమ పార్టీ నెగ్గటానికి కేసీఆర్ ఎంతో సహకరించారన్న వాదనలు ఉన్నాయని.. అలాంటిది ఆయనకు జగన్ ద్రోహం చేయటం బాధ కలిగించే అంశంగా రఘురామ వ్యాఖ్యానించారు. మద్యం కుంభకోణంలో శరత్ ఎవరెవరి పేర్లు చెబుతారో.. దాని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలన్నారు. అప్రూవర్గా మారే అవకాశం నిందితులకే తప్పించి సాక్ష్యులకు ఉందన్న రఘురామ.. “వివేకా హత్య కేసులో నిందితుడైన దస్తగిరి అప్రూవర్ గా మారితే సీఎం జగన్, సజ్జల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన్ను జైల్లో పెట్టాలన్నారు. ఇప్పుడు మద్యం కేసులో అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డిని జైల్లోపెట్టాలని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేస్తే.. ఆయన్ను అరెస్టు చేస్తారా? చేయరు కదా” అని పేర్కొన్నారు.

శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారతారని రెండురోజుల క్రితమే వార్తలు వచ్చాయని.. ఆ వార్త నిజమైనప్పుడు.. శరత్ చంద్రారెడ్డి కొన్ని పేర్లు చెబితే వివేకా హత్య కేసులోని కుట్ర కోణం నుంచి కీలక పేర్లు రాకుండా చూస్తామన్న వార్తల్ని కూడా నమ్మాల్సి వస్తోందన్నారు. శరత్ చంద్రారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అల్లుడి సోదరుడే అన్న విషయాన్ని రఘురామ గుర్తుకు చేయటం గమనార్హం.