పొత్తులు ఉన్నా.. లేకున్నా.. పర్లేదనుకుంటున్న చంద్ర‌బాబు 

తాజాగా ముగిసిన టిడిపి మహానాడు వేదికగా చంద్రబాబునాయుడు ప్రస్తావించ‌ని కీలకమైన అంశం పొత్తులు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావాలా వద్దా అనేటటువంటిది ఆయన మీమాంసలో ఉన్నారనేది స్పష్టమైంది. నిజానికి నిన్న మొన్నటి వరకు కూడా జన‌సేన‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు నాయుడు అంత‌ర్గతంగా పార్టీ నేత‌ల‌తో ప్రకటించారు. ఇదే పార్టీ వర్గాల్లో ప్రచారంలో వచ్చింది. జనంలోనూ దీనిని ముందుకు తీసుకువెళ్లాలి అనేటటువంటిది ప్రచారం జరిగింది.

అయితే ఎక్కువ మంది ప్రజలు జనసేన వైపు మొగ్గు చూపుతున్నారా లేదా అనేటటువంటి విషయంలో ఇంకా సందేహం ఉంది. ఎందుకంటే పవన్ ఇప్పటికీ కూడా సినిమాలకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యం రాజకీయాలకు ఇవ్వడం లేదని వైసిపి నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇది జనంలో బాగా చేరిపోయింది. మరోవైపు పవన్ కళ్యాణ్ విషయం కూడా వారానికి రెండు రోజులు వస్తే నెల రోజులు సినిమాల మీద దృష్టి పెట్టడం, హైదరాబాదు విజయవాడ లేదా విశాఖపట్నం వంటి పర్యటనలు చేయడమే తప్ప ఆయన ఒక వారం రోజులు ఏపీలో కూర్చుని రాజకీయాలు చేయకపోవడం వంటివి లేదు.

ఈ ప‌రిస్థితే  పొత్తులను ప్రభావితం చేస్తున్నాయి. జనాల్లోనూ ఇదే విషయంపై వైసీపీ నాయకులు చక్కగా దాన్ని చర్చ‌కి పెడుతున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ విషయంలో జనంలో ఇంకా సందేహాలు అలాగే ఉండిపోయాయి.  ఆయన పూర్తిస్థాయి రాజకీయ నాయకుడుగా ప్రజలు గుర్తిస్తున్నట్టుగా అనిపించడం లేదు. దీంతో పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచన దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా జరిగిన మహానాడు వేదికగా పొత్తుల విషయంపై ఖచ్చితంగా ప్రకటన చేస్తార టిడిపి నాయకులు భావించారు.

చాలామంది పోతులు పెట్టుకుంటే తమ తమ నియోజకవర్గాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక మెమొరాండం లాగా చంద్రబాబు నాయుడుకు సమర్పించాలని రెడీ అయి వచ్చారని తెలిసింది. అయితే ఈ పొత్తుల విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్కడా ప్రస్తావించకుండా కేవలం తను ఒంటరిగా వెళ్లడానికి సిద్ధం అనేటటువంటి ఒక బలమైనటువంటి వ్యూహాన్ని ఈ మహానాడు వేదికగా ప్రజలలోకి తీసుకువెళ్లారు. దీంతో పొత్తులు ఉంటాయా లేవా అనేటటువంటి చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరోవైపు బిజెపి కలిసి రావాలి అని జనసేన పదే పదే చెబుతున్నా క‌మ‌ల‌నాథులు ఇప్పటివరకు కూడా స్పందించలేదు.

మరోవైపు ఇప్ప‌ట్లో స్పందిస్తారు అనేటటువంటి ఆశ కూడా ఇప్పట్లో కనిపించడం లేదు. మరో రెండు మూడు నెలల్లో కేంద్రంలో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఏపీ పై ప్రత్యేకంగా దృష్టి సారించి బిజెపి సమయాన్ని వృధా చేసుకునే పరిస్థితి ఇప్పుడు అయితే కనిపించడం లేదు. మొత్తం గా చూస్తే టిడిపి ఒంటరిగా పోటీ చేయటానికి అనుకూలమైనటువంటి వాతావరణన్ని సృష్టించుకుంటోంది అనేది స్పష్టంగా అయితే కనిపిస్తోంది.

పొత్తులతో సంబంధం లేకుండా అవసరమైతే ఇప్ప‌టికిప్పుడు ఎన్నికలు జరిగినా తాము ఒంటరిగా బరిలోకి దిగి వంద నుంచి 130 స్థానాల వరకు దక్కించుకునేలాగా వ్యూహాత్మకంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. దీనిలో భాగంగానే మినీ మేనిఫెస్టోను ప్రకటించారని  టిడిపి సీనియర్ నాయకులు సైతం అంతర్గత సంభాషణలో అంగీకరిస్తున్నారు.