గ్రామ వలంటీర్ వ్యవస్థ ఫెయిల్ – రఘురామరాజు

గడిచిన కొద్ది రోజులుగా ఏపీ అధికారపక్షానికి చెందిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ పట్ల వీర విధేయతను ప్రదర్శించే మిగిలిన నేతలకు భిన్నంగా రఘురామ మాత్రం విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఆయన మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు వింటే జగన్ పరివారానికి ఒళ్లు మండిపోవటం ఖాయం. ఓపక్క తమను..తమ అధినేతను పొగుడుతున్న వేళ.. అందుకు భిన్నంగా లోపాలు ఎత్తి చూపిస్తున్న తీరును జీర్ణించుకోలేని పరిస్థితి. తాజాగా ఆయన చేసిన విమర్శలు.. విసిరిన ఆరోపణల్ని చూస్తే..

‘‘గ్రామ వాలంటీర్ వ్యవస్థను చూసి ప్రపంచ దేశాలు పొగుడుతున్నాయని మన పార్టీ నేతలు సోషల్ మీడియాలో గొప్పలు చెబుతున్నారు. నిజంగానే గ్రామ వాలంటీర్లంతా అంత బాగా పని చేస్తుంటే.. కోవిడ్ కేసులు ఎందుకు పెరిగినట్లు? వాలంటీర్ వ్యవస్థ వ్యవహరిస్తున్న తీరును తప్పు పట్టాల్సింది ఉంది. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు లేవా? ఏపీలో ఏం జరుగుతుందో తెలసుకోకుండా ఫ్రాంక్లిన్ ఎందుకు కితాబు ఇచ్చారో అర్థం కావట్లేదు. ఓవైపు కోవిడ్ తో మనషులు చనిపోతుంటే.. మరోవైపు ఫ్రాంక్లిన్ వార్తను సాక్షి పత్రికలో ప్రముఖంగా ప్రచురించటం విడ్డూరంగా ఉంది’’

‘‘శ్మశానాల్లో కూడా టెస్టులు చేశారు సరే.. మరి ఏపీలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? అన్నది ఒకసారి ఆలోచించాలి. కరోనా విషయంలో చాలా అలసత్వాన్ని ప్రదర్శించారు. విశాఖకు ఎప్పుడు వెళదామన్న ఆలోచనలో ఉన్నారే తప్పించి.. మిగిలినవేమీ పట్టటం లేదు. పక్క రాష్ట్రాల్లో కరోనాను బాగానే కంట్రోల్ చేస్తున్నారు. ఏపీలో మాత్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. తాడేపల్లి గూడెం కోవిడ్ సెంటర్ లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు నిజంగానే డబ్బులు ఇవ్వాలనుకుంటే..సీఎం రిలీఫ్ ఫండ్ కు మనీ ట్రాన్సఫర్ చేయొచ్చుకదా? ఊరు పేరు లేని బ్రాండ్లను పెట్టి ప్రజల ప్రాణాల్ని తీస్తున్నారు. మద్యం కొనలేక శానిటైజర్లు తాగి చచ్చిపోతున్నారు’’ అంటూ విరుచుకుపడిన వైనం వైఎస్సార్ కాంగ్రెస్ నేతలకు ఒక పట్టాన జీర్ణించుకోలేనట్లుగా మారింది.