వివేకా హత్య: నిజం చెబితే చంపేస్తా.. అన్నాడు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో త‌వ్విన కొద్దీ అనేక సంచ‌ల‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య‌ను ‘నిజం చెబితే చంపేస్తా’ అని ఏ1 గంగిరెడ్డి తీవ్రంగా బెదిరించిన విష‌యం తాజాగా వెలుగు చూసింది. వివేకా హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్‌మన్‌ రంగన్నను ఈ కేసులో ఏ–1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని సీబీఐ తెలిపింది.

‘ఈ హత్య కేసు విస్తృత కుట్రలో రెండు ప్రధాన చర్యలు ఉన్నాయి. ఒకటి.. హత్య చేయడం. రెండోది.. సంఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయడం. వీటిలో ఎర్ర గంగిరెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారు’ అని పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జూలై 1న తిరిగి విడుదల చేయాలని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ డీఐజీ, దర్యాప్తు అధికారి కేఆర్‌ చౌరాసియా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

అందులో కీలక అంశాలను పొందుపరిచారు. ఎర్రగంగిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను బెదిరిస్తు న్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. సీబీఐపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ దర్యాప్తును అడ్డుకోడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలను పలుసార్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు పరిగణనలోకి తీసుకు న్నాయి. ఏపీ పోలీసులు సకాలంలో చార్జిషీటు దాఖలు చేయని కారణంగా ఎర్రగంగిరెడ్డి డీఫాల్ట్‌ బెయిల్‌ పొందారు.

దానివల్ల ఈ కేసులో యాదాటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగలిగినా కీలక నిందితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోలేకపోయామ‌ని సీబీఐ పేర్కొంది. అందుకే ఆయనకిచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయించామంది. గంగిరెడ్డి మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ అఫిడవిట్‌లో వివరించింది.