ఏపీలో మద్యం అమ్మకాలపై జగన్ సర్కారు కీలక నిర్ణయం

వడ్డించే పన్నులు కావొచ్చు.. పెరిగే ధరలు కావొచ్చు. అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గటం ఎప్పుడైనా చూశామా? అంటే.. లేదనే చెబుతాం. అందుకు భిన్నంగా ఏపీలోని జగన్ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనుంది.

ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇరుగు పొరుగున ఉన్న తెలంగాణ.. తమిళనాడు..కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు భారీగా ఉండటమే కాదు.. ముట్టుకుంటే కాలిపోయేలా ధరల్ని సెట్ చేశారు.

అలా చేయటం ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి తగ్గి.. తమ లక్ష్యమైన పాక్షిక మద్ యనిషేధం దిశగా ప్రజల్ని సిద్ధం చేయాలని జగన్ సర్కారు భావించింది. అందుకు భిన్నంగా.. మద్యం ధరలు భారీగా పెరిగిపోవటంతో.. ఇటీవల కాలంలో శానిటైజర్లు తాగేసి చనిపోతున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. మద్యం ధరలు భారీగా ఉండటంతో చౌకగా లభించే శానిటైజర్లను సేవిస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో మద్యం ధరల్ని భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరల్ని భారీగా తగ్గించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికి ఉన్న ధరల్లో 45 శాతం మేర తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మద్యం ధరల్ని భారీగా పెంచేస్తే.. మేలు జరుగుతుందన్న దానికి భిన్నంగా వరుస దారుణాలు చోటు చేసుకోవటం.. సరిహద్దురాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా కావటంతో పెంచిన ధరల్ని తగ్గించాలన్న ఆలోచనకు ఏపీలోని జగన్ సర్కారు నిర్ణయించినట్లుగా తెలిసింది.