కేసీఆర్ మీద కోపం.. మోడీని ఇరికించిన తమిళ సై?

కాస్తంత తేడాగా ఉన్నప్పటికీ ఒకేలాంటి సీన్ ఇప్పుడు తెర మీదకు వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాట్లాడటానికి మించిన పెద్ద తప్పు మరొకటి ఉండదు. తాము వినిపించే వాదనకు సారూప్యత ఉందన్న ఉద్దేశంతో నోటికి పని చెబితే కొత్త తలనొప్పి రావటం ఖాయం. ఇప్పుడు అలాంటి తీరునే ప్రదర్శించారు తెలంగాణ గవర్నర్ తమిళ సై.
కొత్త పార్లమెంటు భవనం మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న వేళ.. దాని ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోడీ చేత కాకుండా.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఓపెన్ చేయించాలన్న డిమాండ్ తో పాటు.. 19 రాజకీయ పార్టీలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించటం తెలిసిందే.

రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ఓపెన్ చేయించాలన్న పిటిషన్ ఒకటి తాజాగా సుప్రీంకోర్టు దాఖలైంది కూడా. ఇలాంటి వేళ.. ఈ మధ్యనే తెలంగాణలో కొత్త సచివాలయాన్ని ప్రారంభించిన సమయంలో గవర్నర్ ను ఆహ్వానించకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవటం.. దానిపై గవర్నర్ తమిళ సై స్పందించటం తెలిసిందే. కొత్త సచివాలయానికి గవర్నర్ ను ఎందుకు ఆహ్వానించాలంటూ కేసీఆర్ సర్కారు నుంచి వచ్చిన సమాధానాన్ని తప్పు పడుతున్నారు గవర్నర్ తమిళ సై.

తాజాగా ఆమె మాట్లాడుతూ.. మొన్నీ మధ్యనే తెలంగాణలో కొత్తగా కట్టిన సచివాలయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గవర్నర్ ను ఆహ్వానించలేదా? అని అందరూ ప్రశ్నించారు. ఆహ్వానించలేదని నిర్మొహమాటంగా అధికార పార్టీ నుంచి జవాబు వచ్చింది. నేరుగా వచ్చి పిలవకున్నా నాకు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. రాష్ట్రపతిని రాజకీయేతర వ్యక్తంటున్న విపక్షాలు గవర్నర్ల విషయంలో మాత్రం ఎందుకు ఈ మాట అనటం లేదు’’అని తమిళ సై ప్రశ్నిస్తున్నారు.

ఆమె కోణంలో చూసినప్పుడు సరైన పాయింట్ గానే ఉంటుంది. కానీ.. గవర్నర్ ను గుర్తించాలన్న ఆమె మాటతో మోడీ సర్కారు ఇరుకున పడుతుందన్న విషయాన్ని ఆమె గుర్తించకపోవటం గమనార్హం. ప్రభుత్వం తనను గుర్తించాలన్న తపన తమిళ సైకి ఉన్నప్పుడు.. కేంద్రంలోని మోడీ సర్కారు పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతితో ప్రారంభించాలన్న వాదనకు మొగ్గు చూపినట్లే కదా? కేంద్రానికి అలాంటి ఆలోచన లేనప్పుడు.. తాజాగా తాము నియమించిన గవర్నర్ నోటి నుంచి వచ్చిన మాట తమను ఇరుకున పడేసినట్లుగా మోడీ సర్కారు భావిస్తుంది కదా? అంటున్నారు. తనను గుర్తించలేదన్న గవర్నర్ వాదన బాగానే ఉన్నా.. ఈ తొందరలో తాను మాట్లాడిన మాటలు కేంద్రంలోని మోడీ సర్కారుకు ఇబ్బందికరంగా ఉంటాయన్న విషయాన్ని ఆమె గుర్తిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.