కమ్మ.. రెడ్డి..కాపులు ఒక్కరే.. షాకిచ్చే నిజాన్ని చెప్పిన పెద్దాయన

తెలుగు రాజకీయాల గురించి ఒక్క మాట మాట్లాడాల్సి వచ్చినా ఆ వెంటనే వచ్చే పదాల్లో ముఖ్యమైనవి కాపు.. కమ్మ.. రెడ్డి. ఈ మూడు పేర్లు పలకకుండా రాజకీయాల గురించి మాట్లాడలేని పరిస్థితి. తెలుగు ప్రజల జీవితాల్లో అంతలా పెవేసుకున్న ఈ మూడు కులాల నేపథ్యం ఏమిటి? ఇంతకీ ఈ మూడు కులాలకు ఉన్న తేడా ఏమిటి? అసలీ మూడు కులాల ఉనికి ఎప్పటి నుంచి ఉండేదన్న దానికి సంబంధించి సంచలన నిజాల్ని వెల్లడించారు చారిత్రక పరిశోధకుడు.. తెలుగు ప్రాంతాల చరిత్ర గురించి పలు పుస్తకాలు రాసిన ప్రముఖుడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్.

తెలుగు వారికి చరిత్ర అన్నదే లేదనే మాటకు భిన్నంగా.. అందరికి అర్థమయ్యేలా ఆయన చరిత్రను తేలిగ్గా అర్థమయ్యేలా పెద్ద ఎత్తున పుస్తకాలు రాసిన ప్రముఖుడిగా ఆయన్ను చెప్పొచ్చు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన నిజాన్ని వెల్లడించారు. తాను చారిత్రక పరిశోధకుడినని చెబుతూ. ‘‘ఎనిమిదో శతాబ్దం నాటికి కాపు.. కమ్మ.. రెడ్డి కులాలు వేర్వేరు కావు. దాని తర్వాతే అవి మూడుగా మారాయి. కాపు అంటే పొలాలను కాపు కాసేవారు. రెడ్డి అంటే రట్టోడి.. రాష్ట్రకూటులు వీరు. దేశానికి రెడ్లు రక్షణ కల్పించారు. కమ్మవాళ్లకు కరికాల చోళుడికి లింకులు ఉన్నట్లుగా శాసనాలు లభించాయి’’ అని చెప్పుకొచ్చారు.

ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ ప్రాంతాన్ని కమ్మవాళ్లు పాలించారని దీనికి సాక్ష్యంగా ముమ్మడి నాయకుని శాసనం ఉందని చెప్పారు. అప్పట్లో కనౌజ్ ప్రాంతాన్ని కన్యా కుబ్జా అని పిలిచేవారని.. దాన్ని కమ్మ వాళ్లు పాలించారన్నారు. రాజ్యాధికారం కోసం ఈ మూడు కులాలు మెల్లిమెల్లిగా విడిపోయినట్లు చెప్పారు. కళా రంగంలో ఏపీకి చాలా అన్యాయం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

చాలామంది ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినా ఇవ్వలేదన్నారు. ‘‘ఆ మహాపురుషుడికి కులాన్ని అపాదించి భారతరత్న రాకుండా చేశారన్నారు. ఎంజీఆర్ కు భారతరత్న ఇవ్వటంలో ఉన్న లాజిక్ ఏమిటి? ద్రవిడ రాజకీయాల్లో ప్రయోజనం కోసం ఆయనకు భారతరత్న ఇవ్వొచ్చు. సచిన్ టెండూల్కర్.. లతా మంగేష్కర్ కు భారతరత్న ఇస్తారు. ఎన్టీఆరర్ కు మాత్రం ఇవ్వరు. అనాదిగా ఆంధ్రులు వాళ్లు చేయని తప్పులకు అనాదిగా శిక్ష అనుభవిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.