నెల్లూరులో ఉప్పు – నిప్పు కలిశాయి

వైసీపీ ఉదయగిరి సస్పెండెడ్ ఎంఎల్ఏ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్సయిపోయిందా ? అవుననే చెబుతున్నాయి టీడీపీ వర్గాలు. బహుశా ఈనెల 27,28 తేదీల్లో జరగబోయే మహానాడులోనే మేకపాటి టీడీపీ కండువా కప్పుకోవచ్చని ప్రచారం పెరిగిపోతోంది. రాజమండ్రిలో మహానాడు జరగబోతున్న విషయం తెలిసిందే. మేకపాటి టీడీపీ ఎంట్రీ విషయంలో ఒక్కసారిగా స్పీడు పెరిగిపోయింది. దీనికి కారణం ఏమిటంటే దశాబ్దాలుగా మేకపాటికి బద్ధశత్రువుగా ఉన్న టీడీపీ నేత కంభం విజయరామిరెడ్డితో భేటీ అవటమే.

ఉదయగిరిలో దశాబ్దాలుగా మేకపాటి-కంభం ప్రధాన ప్రత్యర్థులుగా ఉండేవారు. కంభం రెండుసార్లు ఎంఎల్ఏగా గెలిస్తే, మేకపాటి నాలుగు సార్లు గెలిచారు. వీళ్ళు ఒకళ్ళకి మరొకళ్ళు ఎదురుపడేవారు కూడా కాదు. అంతవైరం ఉండేది వీళ్ళమధ్య. అలాంటిది హఠాత్తుగా మంగళవారం ఉదయగిరిలో ఇద్దరు భేటీ అవటంతో ముందు ఎవరు నమ్మలేదు. తర్వాత ప్రత్యక్షంగా చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. రాబోయే ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరు పోటీచేయాలని కాకుండా టీడీపీని గెలిపించేందుకు ఇద్దరు కలిసి పనిచేయాలని డిసైడ్ అయ్యారు.

మామూలుగా అయితే సిట్టింగ్ ఎంఎల్ఏ హోదాలో మేకపాటే టికెట్ ఆశిస్తారు. కానీ మేకపాటి అలా టికెట్ ఆశించటంలేదని తమ్ముళ్ళు చెబుతున్నారు. వైసీపీని ఓడించటమే లక్ష్యంగా ఇద్దరు కలిసిపోయారట. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే కంభంకు కొంత పట్టుంటే ఉండచ్చు నియోజకవర్గంలో. అయితే మేకపాటికి అలాలేదు. చంద్రశేఖరరెడ్డికి ఉన్నదంతా కుటుంబం తరపున పట్టుమాత్రమే. చంద్రశేఖరరెడ్డిని సస్పెండ్ చేయగానే మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎంఎల్ఏ మేకపాటి విక్రమ్ రెడ్డి మద్దతుదారులతో మీటింగ్ పెట్టుకున్నారు.

అప్పటి వరకు సిట్టింగ్ ఎంఎల్ఏ మద్దతుదారులుగా ఉన్నవారిలో చాలామంది రాజమోహన్ రెడ్డి, విక్రమ్ పెట్టిన మీటింగ్ కు హాజరయ్యారట. అంటే మేకపాటి వర్గంగా ముద్రపడిన వారిలో చాలామంది ఇపుడు చంద్రశేఖరరెడ్డితో లేరని వైసీపీ నేతలంటున్నారు. తాజా పరిణామాల్లో ఉదయగిరి నుండి వైసీపీ టికెట్ కోసం ఒంటేరు వేణుగోపాలరెడ్డి, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, చంద్రశేఖరరెడ్డి కూతురు రచనారెడ్డి ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఏదేమైనా రాబోయే ఎన్నిక మాత్రం ఉదయగిరిలో చాలా టైట్ గా ఉంటుందనే చెప్పాలి.