కేటీఆర్ మాట‌లు వినిపించాయా.. జ‌గ‌న్‌!!

పోతే కానీ.. ఒక వ్య‌క్తి.. జార విడుచుకుంటే కానీ.. ఒక వ‌స్తువు విలువ తెలియ‌ద‌ని అంటారు. కానీ, చేజేతులా ఒక ప‌రిశ్ర‌మ‌ను రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటించేసినా.. దాని విలువ ఏపీ స‌ర్కారుకు తెలియ‌డం లేదు. అదే.. అమ‌ర‌రాజా కంపెనీ. బ్యాట‌రీల త‌యారీ రంగంలో నాలుగు ద‌శాబ్దాల‌కు పైగా ప‌నిచేస్తున్న ఈ సంస్థ మ‌రో నూత‌న విభాగాన్ని తాజాగా తెలంగాణ‌లోని మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసింది. ఈ ప‌రిశ్ర‌మ‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న చేశారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ కంపెనీ గురించి అనేక విష‌యాలు చెప్పారు. అదేస‌మ‌యంలో గ‌తంలో ఏపీలోని వైసీపీ ప్ర‌భుత్వం ఇదే కంపెనీపై అనేక ఆరోప‌ణ‌లు చేసింది. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో కేటీఆర్ వ‌ర్సెస్ వైసీపీ స‌ర్కారు అమ‌రరాజా కంపెనీపై చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. కేటీఆర్‌-వైసీపీ ప్ర‌భుత్వం చెప్పిన విష‌యాలు చూస్తే.. ఒక కంపెనీని ఎలా ఆక‌ట్టుకోవాలో.. ఒక కంపెనీని చేజేతులా ఎలా నాశ‌నం చేసుకోవ‌చ్చో స్ప‌ష్ట‌మ‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

కేటీఆర్ : పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం ఇస్తేనే యువతకు ఉద్యోగాలు వచ్చి.. రాష్ట్రంలో సంపద సృష్టి జరుగుతుంది. ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే పట్టుదలతో పని చేస్తూనే.. అవినీతి రహిత, పారదర్శక పాలనతోనే సాధ్యమవుతుంది. అమరరాజా గ్రూప్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ తయారీలోనే అతిపెద్ద పెట్టుబడి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణం.

వైసీపీ ప్ర‌భుత్వం: ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు మేం వ్య‌తిరేకం కాదు. కానీ, ప‌రిశ్ర‌మ‌లు స్థాపించేవారు.. 75 శాతం ఉద్యోగాలు ఇక్క‌డివారికే కేటాయించాలి. (ఇది సాధ్యం కాద‌ని.. అనేక కంపెనీలువెళ్లిపోయాయి. ఇక‌, ఏర్పాటు విష‌యంలో అవినీతి పెచ్చ‌రిల్లంద‌నే వాద‌న వినిపించింది)

కేటీఆర్‌: అమరరాజా కంపెనీలో లిథియంతో బ్యాటరీలు ఉత్పత్తి చేస్తారు. దీంతో పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదు. పదేళ్లలో అమరరాజా రూ.9 వేల 500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.

వైసీపీ ప్ర‌భుత్వం: అమ‌ర‌రాజా కంపెనీతో భారీ కాలుష్యం ఏర్ప‌డుతోంది. దీనిలో ప‌నిచేస్తున్న కార్మికుల ర‌క్తంలో లెడ్ ప‌రిమాణం లెక్క‌కు మించి ఉంది. కంపెనీ విస్త‌ర‌ణ‌లో భాగంగా దేశ‌వ్యాప్తంగా పెడుతున్న‌ప్పుడు మేమేం చేస్తాం. (కాలుష్యంపై కోర్టుకు కూడా వెళ్లిన ప్ర‌భుత్వం దుంప‌నాశ‌నం చేయాల‌ని భావించింది. దీంతోనే అమ‌రరాజా పొరుగు రాష్ట్రానికి వెళ్లిపోయింది.)

కేటీఆర్‌: అమ‌రరాజా యూనిట్ రావ‌డం వ‌ల్ల ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవ‌కాశాలు లభిస్తాయి. దశల వారీగా ప్లాంట్‌ను విస్తరిస్తారు.

వైసీపీ ప్ర‌భుత్వం: ఉద్యోగాల‌న్నీ స్థానికుల‌కే ఇవ్వాలి. కేవ‌లం 25 శాతం మాత్రమే పొరుగువారికి ఇవ్వాలి.

కేటీఆర్‌: ఏపీలోని చిత్తూరులో ఉన్న అమ‌రరాజా కంపెనీలలో కాలుష్యం లేదు. గల్లా కుటుంబం అక్కడే నివాసం ఉంటోంది. అనుమానాలుంటే.. బస్సులు పెట్టి తీసుకెళ్లండి.

వైసీపీ ప్ర‌భుత్వం: అమ‌ర‌రాజా కంపెనీ కాలుష్య కాసారం. ఇక్క‌డ గ‌ల్లా కుటుంబం నివాసం ఉండేది సుదూరంగా ఉంది.

కొస‌మెరుపు: ఏపీ చెప్పిన దానికి.. కేటీఆర్ చెప్పిన దానికీ పోలిక లేదు. మ‌రి కేటీఆర్ చెప్పిన మాట‌లు జ‌గ‌న్‌కు కానీ, ప్ర‌భుత్వానికి కానీ.. వినిపిస్తున్నాయా? లేదా?!!