గవర్నర్ పై డోసు పెంచుతున్న బీఆర్ఎస్

గవర్నర్ తమిళిసై పై మంత్రులు, బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఆరోపణల తీవ్రతను పెంచుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ గవర్నర్ ను డైరెక్టు ఎటాక్ చేస్తుండటం గమనార్హం. తాజాగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతు రాజకీయాల్లోకి వచ్చి బీజేపీ తరపున పోటీ చేయమని సూచించారు. పైగా సిద్దిపేటలోనే పోటీ చేయమని చాలెంజ్ కూడా చేశారు. హరీష్ సూచన, చాలెంజ్ లోనే తీవ్రత ఏమిటో అర్ధమవుతోంది. గవర్నర్ గా ఉన్నపుడు రాజకీయాలకు అతీతంగా ఉండాలని తమిళిసైకి హరీష్ గుర్తుచేశారు.

రాజకీయాలు చేయదలచుకుంటే గవర్నర్ పోస్టులో నుండి తప్పుకుని డైరెక్టుగా సిద్ధిపేటలో పోటీ చేయాలన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్ అడ్డుకుంటున్నట్లు మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకోవటం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశాలను బీజేపీకి గవర్నరే కల్పిస్తున్నట్లు హరీష్ ఆరోపించారు. వైద్య విద్యా ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచే ఫైలును గవర్నర్ తన దగ్గర ఏడునెలలు అట్టిపెట్టుకున్నట్లు చెప్పారు.

ఒక ఫైలును ఏడునెలల పాటు అట్టిపెట్టుకుని చివరకు ఆమోదించకుండా వెనక్కు పంపుతారా అంటు ప్రశ్నించారు. గవర్నర్ పోస్టుపైన, మహిళలంటే ఉండే గౌరవం కారణంగానే తమిళిసైను తాము గౌరవిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా అని హరీష్ ఎదురుప్రశ్నించారు. వందేభారత్ రైళ్ళను ప్రారంభిస్తున్న నరేంద్రమోడీ మరి రాష్ట్రపతిని ఎందుకు పిలవటంలేదని అడిగారు. ఇన్ని రైళ్ళని ప్రారంభించిన మోడీ ఒక్కసారి కూడా రాష్ట్రపతిని పిలవలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంగానే గవర్నర్ పై తాము విమర్శలు చేయాల్సొస్తోందని వివరించారు. లేకపోతే గవర్నర్ గురించి మాట్లాడాల్సిన అవసరం తమకు ఏముంటుందన్నారు. గవర్నర్ వైఖరి కారణంగానే మెడికల్ కాలేజీల్లో అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోయారని చెప్పారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేయటానికి కూడా వీలులేకుండా పోతోందన్నారు. బీహార్, ఝార్ఖండ్, ఒడిష్సా రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా నడుస్తున్న యూనివర్సిటి కామన్ రిక్రూట్మెంట్లు నడుస్తున్నట్లు చెప్పారు. ఆ బిల్లును తెలంగాణాలో ప్రవేశపెడదామని అనుకుంటే గవర్నర్ ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలని హరీష్ డిమాండ్ చేశారు.