దేశాధినేతల్ని కలవొచ్చు.. కేసీఆర్ కలవలేం: గవర్నర్ సంచలనం

సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్. భారతదేశానికి వచ్చే దేశాధినేతల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది. కానీ.. తెలంగాణలో మాత్రం ముఖ్యమంత్రిని కలవలేం. ఇదో దురదృష్టకరమైన పరిస్థితి. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు. తెలంగాణలో రాజ్ భవన్.. ప్రగతిభవన్ మాత్రం దగ్గరకు కాలేవు.

ఇటీవల పెద్ద సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. కానీ.. రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా గవర్నర్ అయినా మంత్రులైనా ఓపెన్ మైండ్ తో ఉండాలి. తమ కోసం కాకుండా ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్రం.. దేశం కోసం పని చేయాలి’’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆమె కేసీఆర్ సర్కారు మీద సూటి విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను.. ఆయన వ్యక్తిత్వాన్ని చాటి చెప్పేలా ఆమె వ్యాఖ్యలు ఉండటం సంచలనంగా మారింది. రాష్ట్రాన్ని పాలించే వారు ప్రజల కోసం పని చేయాల్సి ఉంటుందని.. అహంకారాన్ని పక్కన పెట్టి విశాల కోణంలో పరస్పరం చర్చించుకోవాలన్నారు. ‘‘కొందరు ప్రజలకు మంచి చేసిన తర్వాత ఆ విషయం గురించి మాట్లాడతారు. కానీ.. కొందరు మాత్రం కేవలం మాటలు మాత్రమే చెబుతారు. ఏమీ చేయరు. ప్రభుత్వాలు ఏది చేసినా అది అన్ని వర్గాల ప్రజలను మంచి చేసేందుకు చేయాలి. సొంత కుటుంబాల కోసం కాకూడదు’’ అంటూ కేసీఆర్ తీరును పరోక్షంగా వేలెత్తి చూపించేలా చురకలు అంటించారు.

సవాళ్లను అధిగమించాలంటే కమ్యునికేషన్ బాగుండాలన్న గవర్నర్.. అప్పుడే ఏ సమస్యనైనా పరిష్కరించుకోగలమన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్ని భారతదేశం సమర్థంగా ఎదుర్కొని.. ప్రపంచానికి మార్గనిర్దేశకంగా తయారైందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా భారత్ లోనే ఎక్కువ మరణాలు సంభవించే అవకాశం ఉందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందన్నారు. అయితే.. దేశంలో చేపట్టిన సమర్థవంతమైన చర్యల కారణంగా మరణాల సంఖ్య చాలా తక్కువగా చూశామన్నారు.

ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా టీకా ఉత్పత్తి మొదలైతే భారత ప్రజలకు అందుబాటులోకి వచ్చేందుకు ఎన్నో ఏళ్లు పట్టేదని.. కానీ కరోనా వ్యాక్సిన్ నుప్రపంచానికి అందించే సత్తా భారత్ కు ఉందన్న విషయాన్ని నిరూపించినట్లు చెప్పారు. ‘‘రుబెల్లా వ్యాక్సిన్ భారత్ కు వచ్చేందుకు 15 ఏళ్లు పట్టింది. అలాగే పోలియో టీకాకు 20 ఏళ్లు పట్టింది. కానీ.. నేడు భారత్ ప్రపంచానికి వ్యాక్సిన్ అందించే స్థాయిలో ఉంది. కరోనా టీకాల్ని 150 దేశాలకు పంపిణీ చేసిన ఘనత భారత్ కు దక్కింది’’ అంటూ దేశం సాధించిన ప్రగతి గురించి చెప్పిన ఆమె.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై ఘాటైన వ్యాఖ్యలు చేయటం సంచలనమైంది. వరుస పెట్టి చేస్తున్న ఈ విమర్శలపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.