మారుతున్న ప‌వ‌నాలు.. క‌ర్ణాట‌కలో తాజా స‌ర్వే

దక్షణాది రాష్ట్రమైన కర్ణాటకలో మ‌రో 10 రోజుల్లో(మే 10) అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఇక్క‌డ ఏ పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌నేది అనేక స‌ర్వేలు వ‌చ్చాయి. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన స‌ర్వేల‌న్నీ కూడా.. హంగ్ వ‌స్తుంద‌ని చెప్పాయి. అయితే.. తాజాగా వ‌చ్చిన ఒపీనియ‌న్ పోల్ స‌ర్వే మాత్రం ఎవ‌రు అధికారంలోకి వ‌స్తార‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింది.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తాజా స‌ర్వే వెల్ల‌డించింది. దీంతో అధికార బీజేపీ భారీగా నష్టపోనుంద‌ని వెల్ల‌డించింది. ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్స్‌ ఈ సంచలన విషయాలను వెల్లడించింది. దక్షిణాదిన అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని (కర్ణాటక) కాపాడుకోవడం ప్రస్తుతం బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం కాగా, బీజేపీ నుంచి పగ్గాలు తమ చేతుల్లోకి తీసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే, తాజా ఒపీనియన్ పోల్స్‌లో బీజేపీకి వచ్చే సీట్లు ఆ పార్టీకి అంతగా అనుకూలంగా లేవు. సీఓటర్‌తో కలిసి ఏబీపీ న్యూస్ 17,772 మంది ప్రజల అభిప్రాయాలను సేకరించింది.

పీనియన్ పోల్స్ అంచనాల ప్రకారం, 224 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా 107 సీట్ల నుంచి 119 సీట్లు గెలుచుకుంటుంద ని తేలింది. బీజేపీకి 74 నుంచి 86 సీట్లు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇక‌, కుమార‌స్వామి నేతృత్వంలోని ప్రాంతీయ పార్టీ జేడీఎస్ 23 నుంచి 35 సీట్లు గెలుచుకుంటుుంది. ఇతరులు 5 సీట్లు వరకూ గెలుచుకుంటారు. ఓట్ల షేర్ ప్రకారం కాంగ్రెస్ కంటే బీజేపీ 5 శాతం వెనుకబడి ఉంది. కాంగ్రెస్ 40 శాతం ఓట్ షేర్ సాధించుకోనుండగా, బీజేపీకి 35 శాతం ఓట్ షేర్ వస్తుంది. జేడీఎస్‌ ఓట్ షేర్ 17 శాతంగా ఉండనుంది. ఇదే సమయంలో, ఇతరులకు 8 శాతం ఓట్లు వెళ్తాయి.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పనితీరు బాగుందని ఒపీనియన్ పోల్స్‌లో పాల్గొన్న 49 శాతం మంది అభిప్రాయపడగా, 33 శాతం బాగోలేదన్నారు. 18 శాతం మంది ఫరవాలేదని అభిప్రాయపడ్డారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందనే అభిప్రాయంపై బసవరాజ్ బొమ్మైకి 31 శాతం మొగ్గుచూపగా, సిద్ధరామయ్యకు సానుకూలంగా 41 శాతం స్పందించారు. హెచ్‌డీ కుమార స్వామికి 22 శాతం మొగ్గుచూపగా, క‌ర్ణాట‌క కాంగ్రెస్ చీఫ్‌ డి.శివకుమార్‌కు 3 శాతం, ఇతరులకు 3 శాతం మొగ్గుచూపారు.

ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు కోరుకుంటున్న‌ది..
కర్ణాటక ఓటర్లు నిరుద్యోగం ప్రధాన అంశంగా భావిస్తున్నారు. నిరుద్యోగం ప్రధానాంశమని 30 శాతం మంది అభిప్రాయపడగా, కనీస వసతుల అంశంపై 24 శాతం మంది, విద్యపై 14 మంది, అవినీతి ప్రధానాంశమని 13 శాతం మంది, శాంతి భద్రతల అంశం ప్రధానమని 3 శాతం మంది, ఇతర అంశాలకు 16 శాతం మంది మొగ్గుచూపారు.