చింతకాయల విజయ్ కి అనకాపల్లి టికెట్ ?

ఉత్తరాంధ్రపై టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సీమ, కోస్తాంధ్ర కంటే కూడా ఉత్తరాంధ్రలో పార్టీ బలం పెరిగిందని చంద్రబాబు సహా పార్టీ అగ్రనేతలంతా అంచనా వేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు టీడీపీ సమాయత్తం అవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల వేట కూడా మొదలైంది. ప్రతీ నియోజకవర్గమూ ముఖ్యమేనని చంద్రబాబు భావిస్తున్న తరుణంలో అనకాపల్లి లోక్ సభా స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేయడంపైనా ఇప్పుడే దృష్టి పెట్టినట్లు భావిస్తున్నారు..

అనకాపల్లిలో మూడు సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. వారే ఎంపీగా పోటీ చేసి గెలుస్తుంటారు. కాపు, గవర, వెలమ సామాజిక వర్గాలను దాటి అనకాపల్లి ఎన్నిక జరిగిందీ లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న అనకాపల్లి తర్వాతి కాలంలో టీడీపీ వశమైంది. తెలుగు దేశం పార్టీ ఆవిర్బావించిన తరువాత ఇప్పటి వరకు ఐదు సార్లు ఈ ఏంపి స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ నాలుగు సార్లు విజయం సాధించింది. మొన్న జరిగిన ఎన్నికల్లోనే వైసీపీ ఖాతా తెరించింది.

1984 నుండి చూస్తే, ఇప్పటికే గవర సామాజీకవర్గం ఆభ్యర్దులు నాలుగు సార్లు ఏంపిలుగా ఎన్నికయ్యారు. కాపు సామాజీకవర్గం వారు నాలుగు సార్లు ఏంపిగా ఎన్నికయ్యారు. వెలమ సామాజిక వర్గం రెండు సార్లు ఏంపికయ్యారు. పెందుర్తి, మాడుగుల, నర్సీపట్నం, మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ అధికార , విపక్షాల్లో వెలమ సామాజీకవర్గం వారే కీలకంగా ఉన్నారు. అనకాపల్లిలో కాపు, గవర మధ్యనే పోటి ఉంటుంది.

గత ఎన్నికల ఫలితాలు, సామాజిక వర్గం లెక్కలు చూసిన తర్వాతే టీడీపీ అధిష్టానం తమ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశం ఉంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ అయ్యన్న పాత్రుడి కుమారుడు చింతకాయల విజయ్ .. ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన టికెట్ అడగ్గా ఒక కుటుంబంలో ఇద్దరికి కుదరదని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఈ సారి ఒక షరతుతో ఇచ్చే అవకాశం ఉందని ఉత్తరాంధ్రలో టాక్. బాగా సీనియర్ అయిపోయిన అయ్యన్న పాత్రుడికి విశ్రాంతినిచ్చి తనయుడికి మాత్రం టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

అలాగని చింతకాయల విజయ్ కు టికెట్ ఇస్తారని ఖచితంగా పార్టీలో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ, టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.ఆయన వచ్చిన పక్షంలో అనకాపల్లి టికెట్ కేటాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే చింతకాయల విజయ్ పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నారు. వైసీపీని ఎదుర్కోవడంలోనూ, పోరాడటంలోనూ అందరికంటే ముందున్నారు.

వైసీపీని గవర సామాజిక వర్గానికి చెందిన సత్యవతి ఎంపీగా ఉన్నారు. 2024లో ఆమెకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. అప్పుడు ఏ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చే అవకాశం ఉందో లెక్క చూసుకుని టీడీపీ అభ్యర్థిని ఖరారు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పైగా బాగా ఖర్చుపెట్టగల అభ్యర్థికే ఈ సారి టికెట్ ఇవ్వాల్సిన అనివార్యతలు ఉన్నాయి. ఆ దిశగా చింతకాయల విజయ్ కంటే కొణతాలకే ఎక్కువ ఛాన్స్ ఉండొచ్చని చెబుతున్నారు కాకపోతే పార్టీ లాయల్టీకి ప్రాధాన్యం ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు..