త‌మ్ముళ్లూ.. జాగ్ర‌త్త‌..: చంద్ర‌బాబు మెసేజ్ ఇదే!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీలో జోష్ పెరిగింది. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇంకేముంది.. పార్టీ ప‌రిస్థితి అయిపోయింద‌ని అంద‌రూ అనుకున్నారు. అలాంటి పార్టీ ఇప్పుడు దూసుకుపోతోంది. దీంతో ఇత‌ర పార్టీల నుంచి నేత‌లు వ‌చ్చి చేరేందుకు క్యు క‌ట్టారంటే ఆశ్చ‌ర్యం అనిపించ‌క మానదు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు కు అనేక వ‌ర్గాల నుంచి సిఫార‌సులు సైతం పోటెత్తుతున్నాయ‌ని స‌మాచారం. ఇటీవ‌ల జ‌రిగిన‌.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది.

అదేస‌మ‌యంలో ముగ్గురు ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌ను టీడీపీ ద‌క్కించుకుంది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు ఉన్న వాద‌న పోయి.. పార్టీ పుంజుకుంటోంద‌నే టాక్ వినిపించ‌డం ప్రారంభ‌మైంది. ఇక‌, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. దీంతో టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇది మ‌రింత‌గా టీడీపీకి బూస్ట్ ఇచ్చింది. ఫ‌లితంగా.. కాంగ్రెస్‌ స‌హా.. ఇత‌ర పార్టీల నుంచి నాయ‌కులు చేరేందుకు వ‌స్తున్నారు.

అదేస‌మ‌యంలో వైసీపీలోని దాదాపు 50 మంది ఎమ్మెల్యేలు.. త‌మ‌తో ట‌చ్‌లో ఉన్నారంటూ.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు కూడా పార్టీలో చేరేవారికి బ‌లంగా మారాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నాయ‌కులు రంగంలో ఉన్నార‌ని.. వారంతా కూడా.. త‌మ త‌మ మార్గాల్లో చంద్ర‌బాబును క‌లిసేందుకు.. అప్పాయింట్‌మెంట్ తీసుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశార‌ని తెలుస్తోంది.

ఎలా చూసుకున్నా.. ఇప్పుడు ఈ నాలుగు ఎమ్మెల్సీ స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకున్న టీడీపీలో చేరేందుకు నాయ‌కులు క్యూక‌ట్ట‌డం.. మ‌రోవైపు యువ‌గ‌ళం పాద‌యాత్ర స‌క్సెస్ అవ‌డం.. వంటివి ప‌రిశీలిస్తే.. టీడీపీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో పెరిగాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎవ‌రికి వారు.. టీడీపీలో చేరేందుకు తెర‌చాటు ప్ర‌య‌త్నాలు కూడా ముమ్మ‌రం చేశారు.

ప్ర‌స్తుతం జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో చంద్ర‌బాబు అన్ని ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తున్నారు. సొంత పార్టీనే అయినా.. గెలుపు గుర్ర‌మా కాదా? అనేది ఆలోచించి లెక్కలు వేసుకుని మ‌రీ.. ముందుకు సాగుతున్నారు. సో.. త‌మ్ముళ్లూ జాగ్ర‌త్త‌! అనే హెచ్చ‌రిక‌ను ఆయ‌న ప‌రోక్షంగా చెబుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.