నేను విజన్ 2020 అంటే.. నన్ను 420 అన్నారు

తాను విజ‌న్ 2020 అంటే.. త‌న‌ను 420 అంటూ కొన్ని రాజ‌కీయ పార్టీలు గేలి చేశాయ‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు గ‌తాన్ని గుర్తు చేసుకున్నారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తాను విజ‌న్ 2020 అంటూ.. ఒక‌ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేసేందుకు పూనుకొన్న‌ట్టు తెలిపారు. త‌ద్వారా.. రాష్ట్రాన్ని దేశంలోను.. ప్ర‌పంచంలోనూ కూడా అగ్ర‌ప‌థంలో ఉంచేందుకు ప్ర‌య‌త్నించాన‌ని చెప్పారు. ఈ క్ర‌మంలోనే సెల్ ఫోన్ల‌ను తీసుకురావ‌డంపై దృష్టి పెట్టాన‌న్నారు. అయితే.. దీనిని ప్ర‌తిప‌క్షాలు ఎగ‌తాళి చేశాయ‌ని చెప్పారు.

తాజాగా రిప‌బ్లిక‌న్ టీవీ నిర్వ‌హించిన చ‌ర్చావేదిక 2023లో చంద్ర‌బాబు త‌న మ‌న‌సులోని భావాల‌ను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విజ‌న్ 2020 గురించి వివ‌రించారు. ఆనాడు ఎంతో ప‌ట్టుద‌ల‌తో తాను విజ‌న్ 2020 సాకారం కోసం కృషి చేసిన‌ట్టు వివ‌రించారు. ఇదే ఇప్పుడు హైద‌రాబాద్‌ను అగ్ర‌స్థానంలో నిల‌బెట్టింద‌న్నారు. కానీ, ఆ నాడు ఎవ‌రో ఏదో అన్నార‌ని .. ఆగిపోయి ఉంటే.. ఇప్పుడు సైబ‌రాబాద్‌, హైద‌రాబాద్ సాకారం అయ్యేవి కావ‌ని తెలిపారు. ఇప్పుడు కూడా త‌న‌కు 2040 విజ‌న్ ఉంద‌ని చెప్పారు.

సమాజం కోసం ముందుచూపుతో పని చేసే నేతలు ఎప్పుడూ విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. గతంలో త‌న‌ను ప్రతిపక్షాలు విమర్శించేవ‌న్న ఆయ‌న ఇప్పుడూ అలాగే విమర్శలు వస్తున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. సంస్కరణలు అమలు చేయాలని సూచించారు. కేవ‌లం సంక్షేమాన్ని అమ‌లు చేస్తూ.. పోతే.. ఆర్థిక ప‌రిస్థితి దెబ్బ‌తింటుంద‌ని తెలిపారు. ఆర్థిక వ‌న‌రులు , ఆదాయ వ‌న‌రులు కూడా పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

జీఎస్టీ రియాల్టీ.. డిజిటల్ కరెన్సీ రియాల్టీ అనేది కీల‌క‌మ‌ని చంద్ర‌బాబు చెప్పారు. రూ.500కి పైన ఉన్న నోట్లను రద్దు చేస్తే.. అన్ని రకాల అవినీతి తగ్గిపోతుందని తెలిపారు. తాను అధికారం కోసం లేనని, దేశాభివృద్ధి కోసమే పని చేశానని చెప్పారు. వాజ్ పేయి హయాంలో టీడీపీకి ఆరేడు మంత్రిత్వ శాఖలు కేటాయిస్తామన్నా.. తాము అంగీకరించలేదని చంద్ర‌బాబు చెప్పారు. తెలుగు ప్రజలను అభివృద్ధి చేయడమే ప్రస్తుతం త‌న‌ ముందున్న ప్రధాన లక్ష్యమ‌ని చంద్ర‌బాబు వివ‌రించారు. పేదలు లేని ఏపీని రూపొందించడమే త‌న‌ ముందున్న ప్రధాన కర్తవ్యమ‌ని చంద్ర‌బాబు తెలిపారు.