ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం.. ఈసారి ఎవరిని తిడతారు?


సంక్షేమ పథకాల విషయంలో ముందుండే రెండు తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న విషయం తెలిసిందే. ఆర్థికంగా గడ్డు పరిస్థితికి.. కరోనా తోడుకావటంతో నెల తిరిగేసరికి ఆర్థికశాఖ అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఏనెలకు ఆ నెలకు అడ్జెస్ట్ మెంట్లతో కిందామీదా పడాల్సి వస్తోంది. దీనికి తోడు.. రాష్ట్రంలో ఆదాయం బాగా పడిపోవటంతో ఎప్పటికప్పుడు రాష్ట్రం రుణాల దిశగా అడుగులు వేయాల్సి వస్తోంది.

గత నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఆలస్యం కావటం తెలిసిందే. మండలిలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుతో.. బిల్లుపాస్ కాలేదన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అప్పట్లో టీడీపీ తీరుతోనే ఉద్యోగులకు సమయానికి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేకపోయినట్లుగా ఆరోపించింది ఏపీ అధికారపక్షం. అయితే.. ఇదంతా అధికారపక్ష ప్లానింగ్ లోపమని చెప్పినా.. అంతో ఇంతో చెడ్డపేరు టీడీపీ ఖాతాలో పడింది.

ఇదిలా ఉంటే.. ఈ నెలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాల్ని ఒకటో తేదీన ఇవ్వలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. దీనికి కారణం.. ఆర్థికంగా గడ్డు పరిస్థితేనని చెబుతున్నారు. గత నెలలో మాదిరే ఈ నెలలోనూ ఐదోతేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే అవకావం ఉందని.. పెన్షనర్లకు మాత్రం ఈ నెల 8న అందుతాయని చెబుతున్నారు.

ఎందుకింత ఆలస్యమన్న విషయంలోకి వెళితే.. ఆర్బీఐకి బాండ్లు వేలం వేయటం.. నిధుల సమీకరణ చేపట్టి.. ప్రభుత్వం నిధుల్ని విడుదల చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఏ నెలకు ఆ నెల అన్నట్లు పరిస్థితి ఉందని చెబుతున్నారు. గత నెలలో నిందించటానికి తెలుగుదేశం పార్టీ దొరికిందని.. ఈసారి ఎవరి మీద నిందమోపి తిడతారని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. ఇలా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా జీతాలు ఇచ్చే విషయంలో తరచూ ఆలస్యమైతే ప్రభుత్వానికి చెడ్డపేరు పక్కా అని చెబుతున్నారు.