యంగ్ ఎంపీ ఇంటి రాజకీయం హాట్ హాట్ !

రాబోయే ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడుతో చంద్రబాబునాయుడుకు తలనొప్పులు తప్పేట్లు లేదు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ ఎంపీగా కాకుండా ఎంఎల్ఏగా పోటీచేయాలని డిసైడ్ అయ్యారు. ఎంపీని ఎంఎల్ఏగా పోటీ చేయించడం చంద్రబాబుకు ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం అబ్బాయ్-బాబాయ్ మధ్య ఆధిపత్య పోరాటం బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం పార్టీలోని ఇతర నేతల మీద కూడా పడుతుంది.

ఇవన్నీ ముందే ఊహించే చంద్రబాబు రామ్మోహన్ చెప్పిందానికి అంగీకరించటంలేదు. అయితే ఎంపీ పట్టించుకునే పరిస్ధితుల్లో లేరు. జిల్లా వ్యాప్తంగా ఆధిపత్యం కోరుకుంటున్నట్లుంది. ఎందుకంటే తన తండ్రి కింజరాపు యర్రన్నాయుడు ఉన్నపుడు జిల్లా మొత్తం ఆయన కనుసన్నల్లోనే పనిచేసేది. తమ్ముడు అచ్చెన్నాయుడు అన్న ఏది చెబితే అది చేసేవారు. అలాంటిది యర్రన్నాయుడు హఠాత్తుగా పోవటంతో అచ్చెన్న చేతికి జిల్లా ఆధిపత్యం వచ్చేసింది.

ఇపుడా ఆధిపత్యాన్ని తిరిగి బాబాయ్ చేతి నుండి తీసుకోవాలని రామ్మోహన్ అనుకుంటున్నట్లుంది. ఎంపీగా ఉంటే జిల్లాపై ఆధిపత్యం సాధ్యంకాదు. ఎర్రన్నాయుడు ఎంపీగా ఉంటూనే జిల్లాను గుప్పిట్లో పెట్టుకున్నారు. అయితే యర్రన్నాయుడు పరిస్ధితి వేరు ఇప్పటి పరిస్దితి వేరు. అందుకనే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా నర్సీపట్నం ఎంఎల్ఏగా పోటీచేయాలని రామ్మోహన్ డిసైడ్ అయిపోయారు. రెగ్యులర్ గా నియోజకవర్గంలో పర్యటిస్తు ప్రచారం కూడా చేసేసుకుంటున్నారు. దీంతో అచ్చెన్నకు సమస్యగా మారింది.

ఇదే విషయాన్ని చంద్రబాబు మాట్లాడుతు వచ్చేసారి ఎంపీగానే పోటీచేయమని రామ్మోహన్ కు చెప్పారట. అయితే ఎంపీ అందుకు అంగీకరించలేదని పార్టీవర్గాల సమాచారం. ఎంపీ అభ్యర్ధిగా ఎవరినైనా గట్టి నేతను చూసుకోమని రామ్మోహన్ చెప్పేశారట. దాంతో ఏమి చేయాలో చంద్రబాబుకు ఇపుడు అర్ధంకావటంలేదు. బాబాయ్-అబ్బాయ్ మధ్య తలెత్తిన విభేదాలు జిల్లా మొత్తం పడటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు. అచ్చెన్నను ఎంపీగా పోటీచేయించాలంటే తాను ఒప్పుకోవటంలేదు. మరీ సమస్య ఎలా పరిష్కారమవుతుందో అనే టెన్షన్ పార్టీలో రోజురోజుకు పెరిగిపోతోంది.