వివేకా హ‌త్య కేసు.. కొత్త ట్విస్టు భ‌లే

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు వైఎస్ త‌మ్ముడు, జ‌గ‌న్ బాబాయి వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసు ఎంత‌టి సంచ‌ల‌నం రేపిందో తెలిసిందే. ఆ హ‌త్య‌కు సంబంధించి నింద‌ను చంద్ర‌బాబు స‌ర్కారు మీద వేసి జ‌గ‌న్ అండ్ కో బాగానే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందింది.

నిజానికి వివేకాది గుండెపోటు అని సాక్షి మీడియాలో ముందుగా ప్ర‌చారం చేసింది జ‌గ‌న్ కుటుంబ స‌భ్యులే. కానీ త‌ర్వాత హ‌త్య విష‌యం బ‌య‌టికి రాగానే చంద్ర‌బాబు మీదికి నింద‌ను నెట్టేస్తూ సాక్షి మీడియాలో వ‌చ్చిన నారాసుర ర‌క్త‌చ‌రిత్ర క‌థ‌నం అప్ప‌ట్లో హాట్ టాపిక్ అయింది. వివేకా చ‌నిపోయిన గంట‌ల్లోనే ఒక వెర్ష‌న్ మారి ఇంకో వెర్ష‌న్ రాగా.. గ‌త కొన్నేళ్ల‌లో ఈ కేసు ఎన్ని మ‌లుపులు తిరిగిందో.. ఎన్నెన్ని కొత్త వెర్ష‌న్లు వ‌చ్చాయో ప‌రిశీలిస్తే షాక‌వ్వ‌క త‌ప్ప‌దు.

ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న జ‌గ‌న్ సోద‌రుడు అవినాష్ రెడ్డి వ‌ర్గీయులే ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వెర్ష‌న్లు వినిపిస్తుండ‌టం ఈ క‌థ‌లో అస‌లైన ట్విస్టు .గుండె పోటు కాస్తా హ‌త్య‌గా మారాక‌.. ఓవైపు చంద్రబాబే ఈ హత్య చేయించాడ‌ని ఆరోపిస్తూ.. మ‌రోవైపు టైంకి రానందుకు వివేకా తిట్టాడ‌ని ఆయ‌న డ్రైవ‌రే హ‌త్య చేసిన‌ట్లు వివేకా పేరుతో ఒక లేఖ‌ను సృష్టించ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వాతేమో బెంగళూరులో ఉన్న ఒక స్థలం వ్యవహారంలో వివేకా హత్య జరిగింద‌ని ఒక ప్ర‌చారం న‌డిచింది. ఆపై నింద వివేకా కూతురు, అల్లుడు మీదికి మ‌ళ్లింది. ముస్లిం యువతితో కన్న బిడ్డని వారసుడుగా ప్రకటిస్తున్నాడని కూతురు,అల్లుడే చంపేశారనే ఆరోప‌ణ‌ను తెర‌పైకి తెచ్చారు. ఈ ఆరోప‌ణ చేసింది స్వ‌యంగా అవినాషే కావ‌డం విశేషం.

కానీ ఇప్పుడు అవినాష్ తండ్రి భాస్క‌ర్ రెడ్డి ఇంకో కొత్త ఆరోప‌ణ‌ను తెర‌పైకి తెచ్చారు. ఈ కేసు నిందితుల్లో ఒక‌డైన సునీల్ యాదవ్ తన తల్లిపై వివేకానందరెడ్డి లైంగిక వేధింపులు భరించలేక వివేకాని చంపేశాడు అని భాస్క‌ర్ రెడ్డి తాజాగా హై కోర్టులో పిటీషన్ వేయ‌డం గ‌మ‌నార్హం. కొడుకు వివేకా కూతురి మీద ఆరోప‌ణ‌లు చేసిన కొన్ని రోజుల్లోనే తండ్రి ఇలా కొత్త వెర్ష‌న్‌తో పిటిష‌న్ వేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు వెర్ష‌న్ల‌ను మార్చేస్తుండ‌టం ప‌ట్ల సోష‌ల్ మీడియాలో బాగానే కామెడీ న‌డుస్తోంది.