జగన్ పరువు తీసిన బీజేపీ ఎంపీ

ఏపీ బీజేపీకి సోము వీర్రాజు అనే ఒక అధ్యక్షుడు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్ అనే ముగ్గురు ఎంపీలు ఉన్నా కూడా వారెవ్వరూ ఎప్పుడూ ఏపీలోని అధికార పక్షాన్ని బలంగా విమర్శించిన దాఖలాలు లేవు. ఎప్పుడైనా ఏదైనా కార్యక్రమం చేసినా అది తూతూమంత్రమే. ఏపీలో అరాచకాన్ని కానీ, అభివృద్ది శూన్యతను కానీ ప్రశ్నించిన సందర్భాలు, ప్రజలకు తెలియచెప్పిన సందర్భాలు చాలా తక్కువ. వైసీపీ, జగన్ కేంద్రంలోని బీజేపీ పెద్దలతో సఖ్యంగా ఉంటున్నారనో.. లేదంటే స్థానికంగా తమ అవసరాలను వైసీపీ పెద్దలు తీరుస్తున్నారనో .. కారణం ఏదైనా వైసీపీని, జగన్‌ను పల్లెత్తు మాట అనే సాహసం చేయరు ఏపీ బీజేపీ నేతలు.

అయితే ఏపీ బీజేపీ నేతలు చేయలేని పనిని తెలంగాణ బీజేపీ నేత చేసి చూపించారు. ఏపీలో ఓకార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు ఏపీలో జగన్ పాలను ఏకి పడేశారు. ఒక్క మాటతో జగన్ పాలనలోని డొల్లతనం అంతటినీ బయటపెట్టేశారు. ఏపీలో రోడ్ల పరిస్థితిని చూసిన ఆయన అత్యంత దారుణంగా ఉన్నాయని.. తెలంగాణే వెనుకబడింది అనుకుంటే ఏపీ ఇంకా ఘోరంగా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘ఆంధ్రప్రదేశ్‌లో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. మా రాష్ట్రం వెనుకబడింది అనుకున్నాను. తీరా ఇక్కడ చూస్తే మరీ అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయి’ అని బాపురావు అన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఆదివారం జనజాతి సురక్ష మంచ్‌ నిర్వహించిన ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. పాడేరు వాసులు విశాఖ ఎలా వెళుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర విభజన తరవాత కూడా జిల్లా కేంద్రాలు అభివృద్ధి చెందకపోవడం దారుణమన్నారు. కొన్ని గిరి గ్రామాల్లో ఒక్కరు కూడా చదువుకోనివారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతోందన్నారు.

కాగా బాపూరావు ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత కూడా ఏపీ బీజేపీ నుంచి ఎవరూ ఆయన ఇచ్చిన లైను అందుకుని ఏపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం కానీ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి గురించి మాట్లాడే ప్రయత్నం కానీ చేయలేదు. ఒకవేళ ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నట్లు జగన్, వైసీపీ కేంద్రంలోని బీజేపీకి దగ్గరే అయితే, వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఆగ్రహిస్తారే అనుకుంటే మరి అదే బీజేపీకి చెందిన బాపూరావు నిర్భయంగా జగన్ ప్రబుత్వాన్ని ఎలా విమర్శించగలిగారు? ఈ లాజిక్ తెలుసుకుంటే ఏపీ బీజేపీ నేతలు కూడా అక్కడ ప్రతిపక్షం పాత్ర పోషించగలుగుతారు. లేదంటే ఎప్పటికీ ఏపీలో ఇలాగే మిగిలిపోతారు.