బహిరంగ సభలోనే జగన్ మాట కొట్టిపారేసిన వైసీపీ ఎంపీ

వైసీపీ అసంతృప్తి వ్యవహారాలు ఇంతకుముందులా నాలుగు గోడల మధ్య ఉండడం లేదు. బహిర్గతమవుతున్నాయి.. బహిరంగ సభలో ఏకంగా సీఎం జగన్ చెప్పినా కూడా వినకుండా సర్దుకుపోయే ప్రసక్తే లేదని వైసీపీ ఎంపీ ఆగ్రహించడం.. దాంతో జగన్ స్వయంగా ఆయన్ను చేయి పట్టుకుని వేదికపైకి తీసుకెళ్లడం వంటివి ఇంతకుముందెన్నడూ జరగలేదని వైసీపీ నేతలే అంటున్నారు.

వైసీపీలో జగన్ మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరు చేయరు. కానీ బహిరంగంగా వేదికపై ముఖ్యమంత్రి ఎదుట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు తన ఆగ్రహాన్ని, అసంతృప్తిని వ్యక్తం చేయడం కలకలం రేపింది. మంత్రి విడదల రజనితో విభేదాలతో ఆగ్రహంగా ఉన్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ముఖ్యమంత్రి ఎదుట తన ఆవేశాన్ని అణుచుకోలేకపోయారు. పల్నాడు జిల్లాలో జరిగిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టే సమయంలో వేదిక మీదే ఆవేశంతో ఊగిపోయారు. ముఖ్యమంత్రి చెప్పే దానికి అడ్డంగా తల ఊపారు. సర్దుకు పోవాలని చేసిన సూచనను తోసిపుచ్చుతూ కుదరదని అందరి ముందే తేల్చిచెప్పేశారు. ఎంపీ లావు ఆగ్రహాన్ని చూసి బిత్తరపోయిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కొద్ది క్షణాల పాటు ఎలా స్పందించాలో తెలియక స్తబ్దుగా ఉండిపోయారు. చేయి పట్టుకుని తనతో పాటు వేదికపైకి తీసుకువెళ్లారు.

ఫ్యామిలీ డాక్టర్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కలవడానికి 20 మంది సర్పంచులు, పార్టీ పెద్దల పేర్లను ఎంపీ లావు శ్రీకృ‌ష్ణ దేవరాయలు కలెక్టర్‌కు పంపారు. సెక్యూరిటీ కారణాలు చూపుతై వారిలో ఒక్క పేరు కూడా జాబితాలో ఉంచలేదు. ఎంపీకి కూడా సీఎంఓ నుంచి ఆహ్వానం వచ్చిందే కానీ జిల్లా అధికారుల నుంచి రాలేదు. ఇదంతా మంత్రి విడదల రజిని పనేనని.. అధికారులను ప్రభావితం చేసి ఆమె ఇలా చేయించారనేది ఎంపీ ఆరోపణ. ఇదే విషయం జగన్‌కు చెప్పారు ఆయన . స్థానిక ఎంపీకి ప్రోటోకాల్ లేదా అని అధికారులను, సీఎంను ప్రశ్నించారు. జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుల ఫోటోలు కూడా బ్యానర్లలో వేసుకోలేదని, స్థానికంగా వేరే వాళ్ళని ఫ్లెక్స్ లు వేయనివ్వలేదని లావు ఆగ్రహంతో ఊగిపోయారు.

కాగా ఎంపీ కృష్ణదేవరాయులు ఆగ్రహంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, మరో మంత్రి అంబటి రాంబాబు వంటివారు కూడా చూస్తూ ఊరుకున్నారే కానీ సర్దిచెప్పే ప్రయత్నం, ఆపే ప్రయత్నం చేయలేదు. ఎవరో ఒకరు చెప్పాలి కదా.. మేం చెప్పలేకపోయినా ఆయనైనా చెప్తున్నారు చెప్పనీ అన్నట్లుగా ఊరుకున్నారు. కాగా.. ఎంపీ తీరుతో ఆశ్చర్యపోయిన జగన్ ఎప్పటిలా నవ్వుతూ ఆయన చేయి పట్టుకుని వేదికపై తీసుకెళ్లి శాంతింపజేశారు. మంత్రి విడదల రజినికి, మర్రి రాజశేఖర్‌కు కూడా చాలాకాలంగా విబేదాలున్నాయి. ఎంపీ లావు కృష్ణదేవరాయలకు… విడదల రజినికి కూడా ఏమాత్రం పొసగడం లేదు. రెండు వర్గాలు గతంలో బహిరంగంగా ఘర్షణలకు సైతం దిగారు. తాజాగా ప్రోటోకాల్ వివాదం ముదిరి ముఖ్యమంత్రి ఎదుటే అసంతృప్తిని వెళ్లగక్కే వరకు వెళ్లింది.

విడదల రజిని విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ తో పాటు సజ్జల దృష్టికి … ఎంపీ లావు గతంలో తీసుకెళ్లారు. కానీ ఈ వివాదంలో మంత్రి విడదల రజనీ మాటలకే ఎక్కువే ప్రాధాన్యంఇచ్చారనే ప్రచారం ఉంది. ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేదన్న ఉద్దేశంతో ఎంపీ నేరుగా బహిరంగ సభలోనే సీఎం ఎదుట తన ఆగ్రహం వ్యక్తంచేసినట్లు చెప్తున్నారు.