జగన్ లో మార్పు… ఎమ్మెల్యేలు హ్యాపీ

గతానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించారు. నాలుగు ఎంఎల్సీ ఎన్నికల ఓటమితో జగన్ దూకుడు తగ్గిందనే అనుకోవాలి. ఇంతకుముందు వర్క్ షాపులు ఎప్పుడు నిర్వహించినా గడపగడపకు వైసీపీ ప్రభుత్వం ఫీడ్ బ్యాక్ రిజల్టును చదివి వినిపించేవారు. కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎంఎల్ఏల పేర్లు చదవి గట్టిగా మందలించేవారు. టికెట్ల విషయంలో సీరియస్ వార్నింగులిచ్చేవారు. కానీ తాజా మీటింగులో అలాంటి వార్నింగులేవీ లేవు. బుజ్జగింపులు, కర్తవ్యబోధ, టార్గెట్ చేరుకోవటానికి అవసరమైన మార్గనిర్దేశకత్వంతోనే సరిపెట్టారు.

ఇదే సమయంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో స్పీడు కూడా పెంచారు. జగనన్నే మన భవిష్యత్తు అనే కార్యక్రమంలో అందరు పాల్గొనాలని, కార్యక్రమాలను మంత్రులు, ఎంఎల్ఏలతో పాటు ప్రజాప్రతినిధులు, నేతలంతా పాల్గొనాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళాలని సూచించారు. నెలలో 20 రోజులు అందరు జనాల్లోనే ఉండేట్లుగా కార్యాచరణ రూపొందించారు. తాను చెప్పినట్లుగా అందరు సమన్వయంతో కార్యక్రమాల్లో పాల్గొంటే 175కి 175 సీట్లు గెలుచుకోవటం గ్యారెంటీ అన్నారు.

సమావేశంలో జగన్ చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పేశారు. కాకపోతే మునుపటిలా దూకుడుగా కాకుండా కాస్త నచ్చచెప్పే, కన్వీన్స్ చేసే ధోరణిలో చెప్పారంతే. జగన్లో వచ్చిన మార్పుకు అందరు ఆశ్చర్యపోయారు. వర్క్ షాపులో ఏదో జరుగుతుందని అనుకుంటే చివరకు అందుకు భిన్నంగా జరగటంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. నాలుగు ఎంఎల్సీ స్ధానాల్లో ఓడిపోయినందుకు అందరికీ జగన్ అక్షింతలు వేయటం ఖాయమనే ప్రచారం విపరీతంగా జరిగింది. అయితే అదంతా ప్రచారం మాత్రమేనని సమావేశం మొదలవ్వగానే అర్ధమైపోయింది.

పార్టీ యంత్రాంగం మొత్తాన్ని జగన్ ఎన్నికల మూడ్ లోకి తెచ్చేశారు. రీజనల్ కోఆర్డినేటర్లు, కో ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, జిల్లాల ఇన్చార్జి మంత్రులు, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంల్సీలు అందరు జనాల్లోనే ఉండితీరాలని పదేపదే చెప్పారు. వీళ్ళంతా సీనియర్ నేతలు, కార్యకర్తలతో రెగ్యులర్ గా టచ్ లో ఉండాలన్నారు. అవసరమైన మద్దతు కోసం, ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అందరు సోషల్ మీడియాను బాగా వాడుకోవాలని సూచించారు. మొత్తానికి రూటుమార్చి స్పీడు పెంచిన విషయమైతే అర్ధమైంది.