ఈసారి మ‌హానాడు… అదిరిపోయే సెంటిమెంటు!!

టీడీపీ ప్రతిష్టాత్మ‌కంగా ఏటా నిర్వ‌హించే పార్టీ ఆవిర్భావ సద‌స్సు.. మ‌హానాడును ఈ సారి రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా పార్టీ పొలిట్ బ్యూరో తీసుకున్న నిర్ణ‌యం మేర‌కు.. వ‌చ్చే మేనెల‌లో నిర్వ‌హించే ఈ మ‌హానాడుకు రాజ‌మండ్రి వేదిక కానుంది. అయితే.. దీనివెనుక పెద్ద సెంటిమెంటు ఉంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. రాజ‌మండ్రిలో గ‌తంలో నిర్వ‌హించిన మ‌హానాడు అనంత‌రం.. వ‌చ్చిన ఎన్నిక‌ల్లో పార్టీ విజ‌యం ద‌క్కించుకుని అధికారంలోకి వ‌చ్చింద‌ని.. అదే సెంటిమెంటును దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు కూడా రాజ‌మండ్రిలో నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు  చెబుతున్నారు.

అదేవిధంగా ఎన్టీఆర్ శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఎన్నికల మ్యానిఫెస్టోని భిన్నంగా రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. అలాగే ఆర్ధిక తారతమ్యం లేకుండా ఆదాయాన్ని అందరికీ పంచే విధంగా మ్యానిఫెస్టో రూప కల్పన చేయాలని నిర్ణయం తీసుకుంది.  ఏప్రిల్ ఆఖరి వరకూ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రూప కల్పన చేశారు. అలాగే నవంబర్‌లో ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పోలిట్ బ్యూరో భావించింది.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంసిద్దంగా ఉండాలని పార్టీ క్యాడర్, లీడర్‌లకు దిశానిర్దేశం చేసింది. అలాగే పార్టీ సభ్యత్వంలో జీవితకాల (లైఫ్‌ టైమ్) మెంబర్‌షిప్‌ను చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు 5 వేల రూపాయలు రుసుముగా పోలిట్ బ్యూరో నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధుల విజయంపై విశ్లేషణ చేసింది. మూడు స్థానాల్లో టీడీపీ గెలవడంపై నేతలు విశ్లేషించినట్లు తెలిసింది. వైసీపీ ఓటుకు డబ్బులు ఇచ్చినా కూడా ఓటర్లు ప్రభావితం కాలేదని పోలిట్ బ్యూరో భావిస్తోంది. అధినేత నుంచి కార్యకర్త వరకూ ఇక క్షేత్రస్థాయిలో పనిచేసే విధంగా పోలిట్ బ్యూరోలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది.