రికమండ్ చేయరూ ప్లీజ్

రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వైసీపీ డౌన్ అయిపోతోంది. టీడీపి పట్ల జనంలో నమ్మకం పెరుగుతోంది. టీడీపీ నేతలు, కార్యకర్తల్లో ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తోంది. ఇప్పుడు అన్ని దారులు టీడీపీ వైపే చూపిస్తున్నాయి. వైసీపీలోని కొందరు నేతలు టీడీపీలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. వారికి మించి.. కాంగ్రెస్ నుంచి వలసలకు చాలా మంది సిద్ధమవుతున్నారు.

తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ మునిగింది. వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయి కోలుకోలేని దెబ్బతిన్నది. ఆ పార్టీకి మచ్చుకైనా ఒక ఎమ్మెల్యే కూడా లేరు. వచ్చే ఎన్నికల్లోనైనా ఒక్కరూ గెలుస్తారన్న నమ్మకం కలగడం లేదు. దానితో కాంగ్రెస్ నేతలు పక్క చూపులు చూస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన వారు ఇప్పుడు టీడీపీలోకి వెళ్లాలనుకుంటున్నారు.

ఎన్నికలు వచ్చే లోపే పెట్టేబెడా సర్దుకుని వెళ్లి పసుపు కండువా కప్పుకోవాలనుకుంటున్నారు. టీడీపీలో ఇప్పటికే గుంపులు పెరగడంతో వారిని సాదరంగా ఆహ్వానించే పరిస్థితి లేదు. టీడీపీ అధినేత చంద్రబాబును నేరుగా కలిసే అవకాశాలు చాలా మందికి దొరకడం లేదు. డైరెక్టుగా అడిగితే ఎలాంటి సమాధానం వస్తుందో తెలీదు. దానితో ఇప్పుడు చంద్రబాబుకు సన్నిహితులైన రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, మీడియా పెద్దల రికమండేషన్ కోసం కాంగ్రెస్ నేతలు నానా తంటాలు పడుతున్నట్లు సమాచారం.

వారికి రోజూ ఫోన్లు చేసి ఏదోటి చేయాలని, వీలైనంత త్వరగా సహాయ పడాలని కోరుతున్నారట. అయితే చంద్రబాబు దగ్గర చెప్పి ఆయన వైపు నుంచి ఇప్పుడు కాదులే అని సమాధానం వస్తే తాము ఇబ్బంది పడాల్సి వస్తోందని సదరు పెద్దలు ఆలోచిస్తున్నారట. టీడీపీలో ఇప్పుడు అందరినీ చేర్చుకునే అవకాశాలు లేవని ఆ పెద్దలకు అర్థమైపోయింది. దానితో రికమండ్ చేసేందుకు వెనుకాడుతున్నారు. కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. రాజకీయ నాయకులంటే ఆశావాదులు కదా..