తండ్రి ప్రజాస్వామ్యవాది.. కొడుకు అరాచకవాది: ఆనం

వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఆనం రామనారాయణరెడ్డి.. బహిష్కరణ తరువాత తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన జగన్‌పైన, ఆయన ప్రభుత్వంపైన, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల మధ్య ఉన్న తేడాలు చెప్తూ రాజశేఖర్ రెడ్డితో జగన్‌ను పోల్చడానికే వీల్లేదని చెప్పారు. క్రాస్ ఓటింగ్ చేశానంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు.

తాను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఆధారాలుంటే చూపించాలని ఆనం రాంనారాయణరెడ్డి సవాల్ విసిరారు. తాను సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడానికో.. కుటుంబ సభ్యులను హత్య చేయడానికో రాజకీయాల్లోకి రాలేదని ఆనం స్పష్టం చేశారు. ‘మిమ్మల్ని ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తారా? నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలుంటే బయట పెట్టండి. నేను క్రాస్ ఓటింగ్ చేసినట్టు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు’ అని ఆయన ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారారని.. రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. సజ్జల వంద కోట్లకు ఎలా పడగలెత్తారో చెప్పాలన్నారు. “క్రాస్ ఓటింగ్ చేశానో లేదో చెప్పాల్సింది నేను. నాపై ఆరోపణలు చేసే స్థాయి సజ్జలకు లేదు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల క్రితమే కుట్ర చేశారు. సలహాదారు ఉద్యోగానికి సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారు. పోస్టింగ్‌లకు సజ్జల ఎన్ని కోట్లు తీసుకున్నారు. వ్యవస్థలు దిగజారుతున్నాయని సీఎంకు ఎప్పుడో చెప్పా. ప్రభుత్వంలో దోపిడీ జరుగుతోంది. సీఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదు. టీడీపీలో ఏవైనా సమస్యలొస్తే.. వినేవారు.. అర్ధం చేసుకునేవారు. కానీ వైసీపీలో అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవు. నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని కోరలేదు. అధికారుల మెడపై కత్తి పెట్టి పని చేయమనడానికి.. మీరేం చక్రవర్తులు కాదు.. సామ్రాజ్యాదీశులు కాదు. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారు” అన్నారు ఆనం.

“నిజమైన ప్రజాస్వామ్యవాది రాజశేఖర్ రెడ్డి. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి. నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్ ఓటింగ్ చేశాననడానికి ఆస్కారం లేదు” అని ఆనం అన్నారు.

వైసీపీ బహిష్కరించడంతో ఏ పార్టీలో చేరాలనేది ఆలోచిస్తున్నానని.. తన రాజకీయ భవిష్యత్ ప్రారంభమైందే టీడీపీలో అని, కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.