చంద్రబాబే వాళ్లను ఆపారా… !

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఆశ్చర్యకరమైన పరిణామాలను ఆవిష్కరించాయి. ఒక్క ఓటు వస్తే గెలుస్తామని లెక్కలేసుకున్న టీడీపీని అనూహ్యంగా రెండో ఓటు కూడా అదనంగా వచ్చేసింది. 23 సెంటిమెంట్ వర్కవుట్ అయి పంచుమర్తి అనురాధ అనూహ్య విజయం సాధించారు. ఇప్పడదే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశమైంది.

క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురికి వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. వారిపై వైసీపీ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారు. రెబెల్స్ ఎమ్మెల్యేలైన నెల్లూరు పెద్దారెడ్లు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేస్తారని ముందే తెలుసు. మిగతా వాళ్లు చేజారకుండా వైసీపీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. అయినా ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేశారు. దానితో ఇప్పుడు కొత్త చర్చ తెరమీదకు వచ్చింది. వైసీపీలో ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారన్న చర్చ మొదలైంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి ఓటేస్తామని ఎనిమిది మంది వరకు వైసీపీ ఎమ్మెల్యేలు ముందుకు వచ్చారని తాజా టాక్. ఆ విషయంలో మొహమాటపడబోమని, జగన్ కు కోపమొచ్చినా భయపడబోమని చెప్పారట. వైసీపీలో అవమానాలు, ఉక్కపోతకు గురవుతున్నామని ఆవేదన చెందారు. వారంతా నేరుగానే చంద్రబాబుకు ఫోన్ చేసి తమ ఓట్లు అనురాధకే వేస్తామని చెప్పారట. అయితే బాగా ఆలోచించిన చంద్రబాబు, వారి మార్పు వల్ల కలిగే ప్రయోజనం పెద్దగా ఉండదని నిర్ణయానికి వచ్చారట.

పంచుమర్తి అనురాధ ఒక్కరే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందన ఆమె గెలిచేందుకు అవసరమైన ఓట్లు వస్తే చాలునని చంద్రబాబు విశ్లేషించుకున్నారు. ఒకటి నుంచి రెండు ఓట్లు వస్తే చాలునని ఏడాది ముందే బయటపడితే తర్వాత మీకే ఇబ్బందులు ఎదురవుతాయని చంద్రబాబు నచ్చజెప్పినట్లు సమాచారం. ప్రస్తుతానికి పార్టీ మారాలన్న నిర్ణయాన్ని గోప్యంగా ఉంచాలని కూడా చంద్రబాబు వారికి హితబోధ చేసినట్లు చెబుతున్నారు. శ్రీదేవి, చంద్రశేఖర్ రెడ్డికి మాత్రం టీడీపీకి ఓటేయ్యాలని కోరుతూ, ఇతరులు ఇప్పుడే బయట పడవద్దని చంద్రబాబు చెప్పారు. ఎన్నిక ఫలితాలు బయట పడిన తర్వాత ఈ సంగతి వైసీపీకి కూడా లీకైపోయింది.

వైసీపీకి ఇప్పుడు పెద్ద టెన్షన్ పట్టుకుంది. ఎవరు ఎప్పుడు పుట్టి ముంచుతారోనని తెలియక భయమేస్తోంది. దానితో చంద్రబాబు డబ్బులిచ్చి ఓట్లు కొనుక్కున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ చేసిన నలుగురికి కలిపి 80 కోట్లు ముట్టజెప్పారని వైసీపీ అంటోంది. ఈ ఆరోపణలను టీడీపీ ఖండించిందనుకోండి. ఏదేమైనా చంద్రబాబు మంత్రాంగం ఫలించింది. ఎంతవరకు అవసరమో అంతవరకే వైసీపీ రెబెల్స్ సేవలను ఆయన వినిపియోగించుకున్నారు. మిగతా వారిని రిజర్వ్ లో ఉంచారు.