ఆ న‌లుగురు స‌స్పెండ్‌.. వేటు వేసిన వైసీపీ

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పార్టీకి వ్య‌తిరేకంగా ఓటేశార‌ని పేర్కొంటూ.. వైసీపీ న‌లుగురు ఎమ్మెల్యేల‌ను పార్టీ నుంచి స‌స్పెండ్ చేసింది. పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ లో ప్ర‌భుత్వ‌ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. వీరంతా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నుంచి క్రాస్ ఓటింగ్ వేసేందుకు కోట్లాది రూపాయలు తీసుకున్నట్లు పార్టీ భావిస్తున్నట్లు చెప్పారు.

క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలపై చ‌ర్య‌లు తీసుకోక త‌ప్ప‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఆ ప్ర‌కార‌మే తీసుకున్నామన్నారు. ఓటింగుకు సంబంధించి పూర్తిగా అన్ని కోణాల్లోనూ ద‌ర్యాప్తు చేసిన‌ట్టు స‌జ్జ‌ల వివ‌రించారు. వీరంతా చంద్ర‌బాబు చేతిలో కీలు బొమ్మ‌ల్లా వ్య‌వ‌హ‌రించార‌ని అన్నారు. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను మ‌రోసారి ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు కొన్నార‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. క్రాస్ ఓటింగ్ చేసిన వాళ్లకు టికెట్ ఇస్తామని కూడా టీడీపీ నాయ‌కుడు చంద్ర‌బాబు చెప్పి ఉంటార‌ని భావిస్తున్న‌ట్టు స‌జ్జల వ్యాఖ్యానించారు.

గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున టికెట్లు పోందిన వీరు జ‌గ‌న్ క‌ష్టంతో గెలిచార‌ని స‌జ్జ‌ల అన్నారు. పార్టీలో అసంతృప్తి ఉంటే.. దానిపై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోవాల‌ని.. అంతేకానీ.. పార్టీనే ధిక్క‌రిస్తామ‌నే ప‌రిస్థితి ఉండ‌కూడ‌ద‌ని స‌జ్జ‌ల వ్యాఖ్యానించారు. ఇది స‌రైన చ‌ర్య‌గానే పార్టీ అధినేత జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అన్నారు. పార్టీలో ఎవ‌రైనా స‌రే.. పార్టీ విధానాల‌కు.. క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని అన్నారు. కాగా, గురువారం జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి పంచుమ‌ర్తి అనురాధ విజ‌యం ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. అయితే, వాస్త‌వానికి టీడీపీకి 19 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరికి అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఓటేయ‌డంతో అనురాధ గెలుపు గుర్రం ఎక్కారు.