అప్పుడు.. ఇప్పుడు సేమ్ టు సేమ్‌.. పంచుమ‌ర్తి విజ‌యం వెనుక‌!

నిజ‌మే.. ఏపీలో ఇప్పుడు జ‌రిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి మాట్లాడుకుంటే.. టీడీపీ త‌ర‌పున 23 ఓట్లు సాధించిన భారీ విజ‌యాన్ని సొంతం చేసుకున్న పంచుమ‌ర్తి అనురాధ‌కు న్యాయం జ‌రిగింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ‘ఎన్నాళ్లో వేచిన ఉద‌యం’ అన్న‌ట్టుగా.. ఆమె ఎప్ప‌టి నుంచో ఒక ట‌ర్న్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్ప‌టి దాకా ఎదురు చూపులే స‌రిపోయాయి.

ఇక‌, ఇప్పుడు ఆమెకు విజ‌యం స‌మ‌కూరింది. అయితే.. పంచుమ‌ర్తి. విష‌యానికి వ‌స్తే.. విజ‌య‌వాడ‌కు చెందిన ప‌ద్మ‌శాలి(చేనేత‌) వ‌ర్గానికి చెందిన నాయ‌కురాలు. 1990ల‌లోనే రాజకీయ రంగంలోకి వ‌చ్చిన పంచుమ‌ర్తి..అప్ప‌ట్లో టీడీపీ జిల్లాకార్య‌ద‌ర్శిగా, విజ‌య‌వాడ న‌గ‌ర కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. 1994లో వ‌చ్చిన విజ‌య‌వాడ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వార్డు స‌భ్యురాలిగా విజ‌యం ద‌క్కించుకున్న ఆమెకు రిజ‌ర్వేష‌న్ క‌లిసి వ‌చ్చింది. బీసీల‌కు అప్పుడు ఈ సీటును కేటాయించారు.

దీంతో చంద్ర‌బాబు.. అనూహ్యంగా పంచుమ‌ర్తికి అవ‌కాశం ఇచ్చారు. దీంతో ఆమె విజ‌యవాడ న‌గ‌ర మేయర్‌గా ఐదు సంవ‌త్స‌రాలు చ‌క్రం తిప్పారు. న‌గ‌ర అభివృద్ధిలోనూ ఆమె విశేష కృషి చేశారు. అప్ప‌ట్లో అనూహ్యంగా ఎలా అయితే.. చివ‌ర‌గా మేయ‌ర్ ప‌ద‌విని బీసీ కోటాలో ద‌క్కించుకుని త‌న స‌త్తా చాటారో.. ఇప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పంచుమ‌ర్తి అలానే అనూహ్య‌మైన విజ‌యం ద‌క్కించుకున్నారు.

వాస్త‌వానికి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో వ‌ర్ల రామ‌య్య‌(ఎస్సీ) ను బ‌రిలోకి దింపాల‌ని అనుకున్నారు. అయితే.. చంద్ర‌బాబు అనూహ్యంగా.. బీసీల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని భావించి చివ‌రి నిముషంలో పంచుమ‌ర్తికి అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, గెలుపు కూడా అనూహ్య‌మ‌నే చెప్పాలి. టీడీపీలో అత్యంత అంకిత భావం ఉన్న నాయ‌కురాలిగా పేరు తెచ్చుక‌న్న పంచుమ‌ర్తి.. సుదీర్ఘ‌కాలం అనేక క‌ష్టాలు ప‌డ్డారు.

మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే సీటు ఆశించారు. కానీ, రాలేదు. పార్టీ అధికారంలో ఉన్నా.. పెద్ద‌గా గుర్తింపు ల‌భించ‌లేదు. ఎట్ట‌కేల‌కు.. అనూహ్యంగా మండ‌లిలో అడుగు పెడుతున్నారు. ఇది.. అనూహ్య‌మే అయినా.. పంచుమ‌ర్తి లాంటి వ్య‌క్తి.. మండ‌లికి అవ‌స‌రం అంటున్నారు ఆమె గురించి తెలిసిన వారు.