మంత్రులపై జగన్ ఆగ్రహం

వైసీపీ నేతలు ఎంత మరిచిపోదామనుకున్నా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బాధను పంటి బిగువున నొక్కేసుకుంటున్నారు. పైగా ఎన్నికల తర్వాత టీడీపీ స్పీడ్ పెంచడంతో పుండు మీద కారం చల్లినట్లవుతోంది. పైగా వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రచారం బెడిసి కొట్టిందని కూడా టాక్ నడుస్తోంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లోని 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిథిలో 7 లక్షల 70 వేల మంది ఓటర్లు పాల్గొన్న ఈ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని అధికార పార్టీకి చెందిన ఉత్తరాంధ్రా ఇన్‌చార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి ముందే ప్రకటించడంతో ఇప్పుడు పార్టీ ఇరకాటంలో పడింది..విశాఖ రాజధానికి ప్రజలు వ్యతిరేకమని ఈ ఎన్నికలు తేల్చిచెప్పాయి.

చివరకు ముఖ్యమంత్రి సొంత జిల్లా కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రాయలసీమ వెస్ట్ , ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన రాయలసీమ తూర్పు నియోజకవర్గంలో కూడా వైసిపి అభ్యర్ధులు పరాజయం పాలయ్యారు. పైగా పులివెందులకు చెందిన రామ్‌ గోపాల్ రెడ్డి టీడీపీ తరపున ఎన్నిక కావడం ముఖ్యమంత్రికి రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది.

ఛాంబర్ లో క్లాస్

ఎన్నికలు జరిగిన జిల్లాలకు చెందిన మంత్రులను సీఎం, అసెంబ్లీలోని తన ఛాంబర్ కు పిలిపించుకుని తలంటినట్లు చెబుతున్నారు. మిమ్మల్ని నమ్ముకొని బాధ్యతలను అప్పగిస్తే మీరు చేసింది ఏంటని నిలదీశారు. తమ పట్టభద్రుల నియోజకవర్గం పరిథిలో ఒక ఎమ్మెల్యే కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని 60 లక్షలు ఇస్తే ఆయన ఆరు లక్షలు కూడా ఖర్చు పెట్టలేదని ఒక మంత్రి చెప్పగా, సమాచారం ముందే తెలిస్తే మీరేం చేస్తున్నారని సిఎం ఎదురు ప్రశ్నించినట్టు తెలిసింది. కొంతమంది ఎమ్మెల్యేలు అసలు ఈ ఎన్నికలను పట్టించుకోలేదని, తాము ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాలేదని మరో మంత్రి చెప్పగా, ఆయన మీద సిఎం సీరియస్ అయ్యారని తెలిసింది. ఎమ్మెల్యేల పై మీకు పట్టెందుకు లేదని రివర్స్ లో ప్రశ్నించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిమ్మల్ని నమ్ముకునే బదులు అసెంబ్లీ ఎన్నికల్లో నా మనుషులను పెట్టుకుంటానని కూడా సీఎం హెచ్చరించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేల కామెంట్స్

రాయలసీమ వెస్ట్ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి గెలుపొందడం సీఎంకు రాజకీయంగా మరింత ఇబ్బంది కరంగా మారింది. ఒక పక్క ఆయన క్లాస్ తీసుకుంటే మరో పక్క అసెంబ్లీ కారిడార్లలో ఎమ్మెల్యేలు కూడా చర్చించుకున్నారు. ఓటమికి సీఎం కూడా బాధ్యత వహించాలని ఒక ఎమ్మెల్యే వాదించారట. ఉత్తరాంధ్రలో ఘోర పరాజయం కొంతమంది పాపాల ఫలితమని ఆ ఎమ్మెల్యే అన్నారట. విశాఖలో స్థలాలు, పొలాలు, ఇళ్లు ఉన్నవారు భయపడిపోతున్నారని,ఎక్కడ కబ్జాకు గురవుతాయోనన్న భయం వారిలో ఉందని మరో ఎమ్మెల్యే విశ్లేషించారట.

ముందే తెలుసా..

పట్టభద్రుల ఎన్నికల్లో ఓడిపోతామని కొందరు మంత్రులు ముందే గ్రహించారట. దానితో బాధ్యత అప్పగించిన మంత్రి మినహా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆఖరి రెండు రోజులు మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు. దానితో ఆగ్రహానికి లోనైన జగన్, వచ్చే ఎన్నికల్లో ఎలా చేయాల అనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.