స్పీకర్ తమ్మినేని ఆ మరక అంటించుకుంటారా?

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ స్పీకర్ ఒక టీడీపీ ఎమ్మెల్యేకు సంబంధించిన పాత రాజీనామా లేఖను ఆమోదించారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో చాలాకాలం కిందట టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు.

అయితే.. ఉప ఎన్నిక వస్తే తమకు ఇబ్బంది అనే కోణంలో అప్పట్లో ఆయన రాజీనామాను ఆమోదించలేదు. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉండడంతో టీడీపీకి ఒక ఓటు తగ్గించే ఉద్దేశంతో ఆయన రాజీనామాను ఆమోదించినట్లు ప్రచారం జరుగుతోంది.

దీనిపై స్వయంగా గంటా కూడా స్పందించారు. తన రాజీనామాను ఇప్పుడు ఆమోదిస్తే అది చెల్లదని… ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లుగా తమ పేర్లన్నీ ప్రకటించిన తరువాత రాజీనామా ఆమోదిస్తే అది టెక్నికల్‌గా కుదరదని చెప్పారు. వైసీపీ మైండ్ గేమ్ ఆడుతోందని… తన ఓటు తగ్గడం వల్ల టీడీపీ ఎలాగూ గెలవదని చెప్తూ వైసీపీ అసంతృప్తులు టీడీపీకి ఓటేయకుండా ఆపేందుకు ఈ మైండ్ గేమ్ ఆడుతోందని చెప్పారు. వైసీపీకి దుర్భుద్ధి ఉన్నా స్పీకర్ ఆ పని చేయలేరని.. చేస్తే చరిత్రలో ఎన్నడూ లేనటువంటి మచ్చ ఆయనపై పడుతుందని పరిశీలకులు అంటున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా అప్పట్లో రాజీనామా చేశారు. కానీ, స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. తన రాజీనామా ఆమోదించాలని గంటా కోరినా అది జరగలేదు. అయితే… గంటా అప్పట్లో పంపిన రాజీనామా లేఖ స్పీకర్ ఫార్మాట్లోనే ఉండడంతో దాన్ని ఇప్పుడైనా ఆమోదించే అవకాశం ఉంది.

అయితే, ఇక్కడ సమస్యంతా నైతిక విలువలు. పూర్తిగా రాజకీయమే చేయాలనుకుంటే పాలక వైసీపీ చెప్పినట్లు స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదిస్తారు. అలాకాకుండా నైతికతపై ఆధారపడితే స్పీకర్ ఈ రాజీనామాను ఆమోదించకపోవచ్చు. ఒకవేళ స్పీకర్ తమ్మినేని కనుక ఈ రాజీనామాను ఆమోదిస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కోక తప్పదు. ఒకరకంగా ఆయన రాజకీయ జీవితంలో అది మచ్చగా మిగిలిపోయే ప్రమాదముంది.