రేవంత్ ఈ ఫైర్ కొన‌సాగించు.. గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై

తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై.. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్ర‌భుత్వంపైనా.. సీఎం కేసీఆర్‌పైనే ఓ రేంజ్‌లో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తూనే ఉన్నారు. నిజానికి ప్ర‌భుత్వం ఆమోదించిన బిల్లుల‌ను తాను ముద్ర వేయ‌కుండా తొక్కిపెట్ట‌డంపై కేసీఆర్ సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కారు. అప్ప‌టి వ‌ర‌కు కూడా ఇరు ప‌క్షాల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో వివాదాలు సాగుతున్నాయి. అయితే.. ఇప్పుడు ఇవి మ‌రీ ఓ రేంజ్‌కు పెరిగాయి. తాజాగా ఉగాదిని పుర‌స్క‌రించుకుని రాజ్‌భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి కాంగ్రెస్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

వీరిలో కాంగ్రెస్ తెలంగాణ చీఫ్ రేవంత్‌రెడ్డి.. స‌హా ఇత‌ర నేత‌లు రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిశారు. ఈ క్ర‌మంలో ఆమె వారితో సుమారు గంట‌పాటు మాట్లాడిన‌ట్టు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వారితో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘టీఎస్పీఎస్సీ ఘటన చాలా పెద్దది.. సీరియస్‌గా తీసుకుంటాం’ అని గవర్నర్ స్పష్టంగా చెప్పిన‌ట్టు స‌మాచారం. ప్రతిరోజూ ప్రభుత్వం, ప్రతిపక్ష నేతల కామెంట్స్ చూస్తున్నానని, రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నాని, బాగా మాట్లాడుతారని.. ఇదే టెంపో కొన‌సాగించాల‌ని కూడా తమిళిసై రేవంత్‌కు సూచించారని తెలిసింది.

కాగా, టీఎస్పీఎస్సీ అంశంపై యాక్షన్ తీసుకోవాలని, విచారణ పారదర్శకంగా జరిగేలా చూడాలని గవర్నర్‌ను కోరినట్లు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. కోర్టులో కేసు వేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వల్ల లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని అన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. పేపర్ లీక్‌లో మంత్రి కేటీఆర్ శాఖ ఉద్యోగులదే కీలకపాత్రని ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చామన్నారు.

ఇప్పుడున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను సస్పెండ్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. అందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని.. కానీ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. విచారణ పూర్తయ్యే వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను రద్దు చేసే విశేష అధికారం గవర్నర్‌కు ఉందన్నారు. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని, కోట్లాది రూపాయలకు పేపర్ అమ్ముకున్నారని రేవంత్‌ విమర్శించారు.