‘మూడు’కు మాడు ప‌గిలిన‌ట్టేనా?

వ‌చ్చే ఎన్నిక‌లలోపు.. మూడు రాజ‌ధానుల‌ను ఏర్పాటు చేయాల‌ని..ముఖ్యంగా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిని చేయాల‌ని భావిస్తున్న వైసీపీ.. ఉత్త‌రాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటును ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. బ‌లమైన సామాజిక వ‌ర్గానికి చెందిన సీతంరాజు సుధాక‌ర్‌ను ఇక్క‌డ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించింది. ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం ద్వారా.. విశాఖ‌ను పాల‌న రాజ‌ధాని చేస్తామ‌న్న‌.. త‌మ‌కు ఇక్క‌డి ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలిపార నే వాద‌న‌ను వినిపించాల‌ని భావించింది.

ఒక‌వైపు న్యాయ‌స్థానాల ప‌రిధిలో ఉన్న రాజ‌ధాని విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాలు కూడా వైసీపీ పాల‌కులు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. మూడు రాజ‌ధానుల‌ను ఎదిరించేవారు .. విమ‌ర్శించేవారి నోళ్ల‌కు తాళాలు ప‌డ‌తాయి! అని వైసీపీ నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌క‌టించారు. ఇక‌, దీనికి తోడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌లోభాల‌కు తెర‌దీశార‌నే వాద‌న ఉండ‌నే ఉంది.

గ్రాడ్యుయేట్ ఓట‌ర్ల‌కు వెండి నాణేలు పంచ‌డం.. ఓటుకు రూ.5 వేల‌ నుంచి రూ.10 వేల‌వ‌ర‌కు పంచ‌డం కూడా చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఇవ‌న్నీ ఇలా ఉంటే.. ఎన్నిక‌ల‌ను వైసీపీ కీల‌క నాయ‌కుడు వైవీ స‌బ్బారెడ్డి త‌న భుజాల‌పై వేసుకున్నారు. ఎట్టి ప‌రిస్తితిలోనూ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకోవాలని.. త‌ద్వారా.. పాల‌నా రాజ‌ధానికి ప్ర‌జ‌లు మొగ్గు చూపుతున్నార‌నే సంకేతాలు ఇవ్వాల‌ని ఆయ‌న అనుకున్నారు.

అయితే.. అనూహ్యంగా ఇక్క‌డ భారీ ఓట్ల తేడాతో వైసీపీ ఘోర‌ప‌రాజ‌యం పాలైంది. టీడీపీ అభ్య‌ర్థి చిరంజీవిరావు విజ‌యం ద‌క్కించుకున్నారు. కాదు.. కాదు.. గ్రాడ్యుయేట్లు గుండుగుత్త‌గా.. ఇక్క‌డ ఆయ‌న‌కే ఓటు వేయ‌డం ద్వారా.. వైసీపీ వ్యూహాన్ని వారు చిత్తు చేశార‌ని అంటున్నారుప‌రిశీల‌కులు. మూడు రాజ‌ధానుల తో విశాఖ‌లో అడుగులు వేయాల‌ని భావించి.. వైసీపీకి ఇది భారీ షాక్ కావ‌డం గ‌మ‌నార్హం.

దీనిని బ‌ట్టి.. విశాఖ పాల‌నా రాజ‌ధానిగా త‌మ‌కు అవ‌స‌రం లేద‌నే సంకేతాలు ఇక్క‌డి గ్రాడ్యుయేట్లు స్ప‌ష్టం చేసిన‌ట్టు అయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ఫ‌లితం త‌ర్వాతైనా.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు జపం మాపేసి.. ప్ర‌జ‌ల నాడి ప్ర‌కారం రాజ‌ధాని విష‌యంలో న‌డుచుకుంటుంద‌నే భావ‌న ప్ర‌జాస్వామ్య వాదుల నుంచి వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.